హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా రైతులకు మూడురోజుల్లో నగదు చెల్లించాల్సిందేనని, కిందిస్థాయిలో పరిశీలనకు విజిలెన్స్ బృందాలను ఏర్పాటుచేస్తున్నట్లు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. రైతులకు నగదు చెల్లింపుల్లో ఆలస్యంపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన రూ. 20 వేల కోట్లను సీఎం కేసీఆర్ ముందస్తుగానే సమకూర్చారని, కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు సకాలంలో నగదు అందడం లేదని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల వివరాలను మిల్లర్లు ట్రాక్షీట్లలో నమోదుచేయడం లేదని అధికారులు చెప్పడంతో, మిల్లర్లు వివరాలు ఇవ్వకుంటే జిల్లా మేనేజర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు రేషన్ డీలర్లకు దీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న రూ.28 కోట్ల కమీషన్ను విడుదల చేసినట్లు మారెడ్డి తెలిపారు. రేషన్ డీలర్ల నుంచి సేకరించే గోనె సంచుల ధరను కూడా రూ. 18 నుంచి రూ. 21 పెంచినట్లు తెలిపారు. ఇకపై డీలర్లంతా గోనె సంచులను పౌరసరఫరాలశాఖకు అప్పగించాలని కోరారు.