‘నేను హెలికాప్టర్లో వస్తున్న సందర్భంలో రోడ్లమీద వడ్ల కుప్పలు ఆరబోసి కనిపించాయి. నాలుగైదు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయపనుల్లోనిమగ్నమైతరు. అందుకే ధాన్యం సేకరణ ప్రక్రియను సత్వరమే ముగించాలి.’
-వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఆర్థికంగా నష్టమొస్తున్నప్పటికీ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్రంలో ఈ నెల 30 వరకు లాక్డౌన్ విధించామని.. దానిని సమర్థంగా అమలుచేస్తేనే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. కరోనాను ఇంట్లోనే కట్టడి చేసేలా రెండో విడుత జ్వర సర్వేను ప్రారంభించాలని సూచించారు. మరికొద్దిరోజుల్లో రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో యాసంగి ధాన్యం సేకరణను వారం, పది రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. శుక్రవారం వరంగల్ ఎంజీఎం దవాఖాన, సెంట్రల్ జైలును సందర్శించిన అనంతరం సీఎం కేసీఆర్ వరంగల్ కలెక్టర్ కార్యాలయం నుంచి డీజీపీ, పోలీసు కమిషనర్లు, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్న తీరు, జిల్లాల్లో కరోనా పరిస్థితి, కొవిడ్ కట్టడి కోసం తీసుకుంటున్న కార్యాచరణ తదితర అంశాలపై సమీక్షించారు. సీఎం కేసీఆర్ అన్నిజిల్లాల కలెక్టర్లను పేరుపేరునా పలుకరిస్తూ పలు సూచనలు చేశారు. కరోనా, ధాన్యం సేకరణ, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై వారితో సమగ్రంగా చర్చిచారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో లాక్డౌన్ కఠినంగా అమలు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
గ్రామాల్లో సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు లాక్డౌన్ను స్వచ్ఛందంగా అమలుచేస్తున్నారని.. నగరాలు, పట్టణ్లాల్లో మాత్రం మరింత సమర్ధంగా అమలుకావాల్సి ఉన్నదని చెప్పారు. దీనిపై అందరూ దృష్టిపెట్టాలని కోరారు. రాష్ట్ర రెవెన్యూ నష్టం గురించి ఆలోచించకుండా లాక్డౌన్ అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం నియమ నిబంధనల ప్రకారం లాక్డౌన్ను కఠినంగా అమలుచేయాల్సిన బాధ్యత డీజీపీ, ఎస్పీలు, కలెక్టర్లు అందరిపై ఉన్నదని చెప్పారు. ఉదయంపూట సడలించిన నాలుగు గంటలు మినహా మిగతా 20 గంటలు కట్టుదిట్టంగా అమలుచేయాలని ఆదేశించారు. అత్యవసర సేవలను, పాస్లు ఉన్నవారిని మినహాయించి.. మిగిలినవారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించవద్దని చెప్పారు. అదే సమయంలో యాసంగి ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాల్లో కరోనాకు సంబంధించి మందుల సరఫరా, ఆక్సిజన్ సరఫరా ఎలా ఉన్నది అని సీఎం కేసీఆర్ ఆరాతీశారు. మొదటి విడుత జ్వర సర్వేకు కొనసాగింపుగా రెండో విడుత కూడా ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారు. దవాఖానల్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కొవిడ్ దవాఖానల్లో చెత్తను ఎప్పటికప్పుడు తరలించేలా స్పెషల్డ్రైవ్ చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సహా అన్నిజిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
కొవిడ్ దవాఖానల్లో సేవలందిస్తున్న అన్నిరకాల ఔట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్పైడర్స్ (ఆర్టీసీ డ్రైవర్లు, కండక్లర్లు, కూరగాయల వ్యాపారులు, సేల్స్మెన్)ను గుర్తించి, జాబితాను రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. వీరందరికీ టీకాలు వేసేందుకు స్పెషల్డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూలు తదితర జిల్లాల్లో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గడం లేదని, వెంటనే ఈ జిల్లాలకు స్వయంగా వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇతర రాష్ర్టాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు కరోనా కట్టడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కరోనా క్లిష్ట సమయంలో దవాఖానల్లో పనిచేస్తున్న యావత్ సిబ్బందికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.