‘ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటార’ని నినదించాడు రష్యా విప్లవ నేత లెనిన్. తెలంగాణ గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భంలో రష్యా గురించి, అందునా లెనిన్ గురించి ఎందుకంటే.. మంచి ఎక్కడున్నా తీసుకోవాలి, మంచి ఎవరు చెప్పినా పాటించి తీరాలనేదే సమాధానం. కామధేనువులాంటి తెలంగాణను ఆరుదశాబ్దాల పాటు పీక్కుతిన్న ఆంధ్ర పాలకులు, తెలంగాణ ప్రజలను అభివృద్ధి నినాదాలతోనే మోసం చేసిన్రు. అరవై యేండ్ల సంధి తెలంగాణ బిడ్డలు దగా పడ్డరు. ఉమ్మడిపాలకుల పాపాలు, కుట్రలు, కుతంత్రాలు తెలంగాణ మలిదశ ఉద్యమం బద్దలు కొట్టింది. బంగారు భవిష్యత్తు నిర్మించాలనుకునే ఏ వ్యక్తులైనా సరే చరిత్రను అధ్యయనం చేయాలంటారు అంబేద్కర్.
రాష్ట్ర సాధన తర్వాత బంగారు తెలంగాణగా రూపొందుతున్న తీరుతో విపక్షాలకు దిక్కుతోచటం లేదు. అప్పుడు ఇప్పుడు ప్రాంతేతరుల కుట్రలు షరామామూలే కానీ.., కానీ ఇప్పుడు సరికొత్తగా ప్రాంతంవాళ్లే ఆ కుట్రల్లో భాగస్వాములవుతున్నరు. అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న శకుని మామలను రాజకీయ సమాధి చేయాలె. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ కుట్రలు, కుహకాలు చేస్తున్నయ్. ఎన్ని చేసినా పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపుతో మరింత విశ్వసనీయతను పెంచుకున్నారు కేసీఆర్. రాష్ర్టాన్ని సాధించిన టీఆర్ఎస్ను ప్రజలు తమ పార్టీగా, కేసీఆర్ను ఇంటి పెద్దబిడ్డగా చూసుకుంటున్నారు.
రేపటి తెలంగాణ భవిష్యత్తు గురించి చరిత్రలో సత్యాలను తెలుసుకోవాల్సిందే. 1969లో తెలంగాణ ఉద్య మం ఉవ్వెత్తున ఎగిసినా, దాన్ని రాజకీయాలతో చల్లార్చారు. అప్పటి నుంచి ఉద్యమజాడలే ఉమ్మడి రాష్ట్రంలో కనిపించలేదు. కానీ 2001 ఏప్రిల్ 27న వెలువడిన ఒక ధిక్కార ప్రకటన.. జరగబోయే అద్భుతానికి వేదికగా నిలిచింది. ఇందుకు హైదరాబాద్లోని జలదృశ్యం సాక్షిగా చరిత్రలో చోటు సంపాదించుకున్నది. అదే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ప్రకటన. దీనికి పూర్వరంగం కూడా సుదీర్ఘమైనది. కేసీఆర్ వరసగా ఎనిమిది సార్లు అసెంబ్లీకి, అయిదుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, వివక్షను కండ్లారా చూసి రాష్ట్ర సాధనతోనే తెలంగాణకు నిజమైన విముక్తి సాధ్యమని టీఆర్ఎస్ స్థాపిస్తున్నట్లు చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.
2001 మే 17న కరీంనగర్లో సింహ గర్జన సభలో టీఆర్ఎస్ను రాజకీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్.. అదే ఏడాది జూన్లో జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు వేదికగా ఉద్యమ స్ఫూర్తిని నింపారు. 2001 ఆగస్ట్ 18న టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన నాటి నుంచి తెలంగాణలో మరింత సంస్థాగతంగా స్థిరపడేలా చేశారు కేసీఆర్. సెప్టెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ను సిద్దిపేట ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. అలా టీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో అడుగు పెట్టిన కేసీఆర్ వెనుదిరిగి చూడలేదు.
2004 ఎన్నికల వరకూ ఉద్యమవేడి ఏ మాత్రం తగ్గకుండా నిలుపుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ నేతలే కేసీఆర్ ఇంటికొచ్చి పొత్తులు పెట్టుకున్నారు. అలా 2004లో చేయితో చెయ్యి కలిపి కూటమిగా బరిలోకి దిగిన కేసీఆర్ 26 ఎమ్మెల్యే స్థానాలు, 5 ఎంపీ స్థానాలు దక్కించుకుని కారు స్పీడేంటో చూపించారు. ఆపై కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కించుకున్నారు. యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్లో తెలంగాణ అంశాన్నీ చేర్చేలా, రాష్ట్రపతి చేసిన తొలి ప్రసంగంలోనూ తెలంగాణ అంశం ఉండేలా చేయగలిగారు. అనేక ఆటుపోటుల మధ్య కేసీఆర్ 2009 వరకు తెలంగాణలో ఉద్యమాన్ని మరింత లోతుగా జనంలోకి తీసుకెళ్లారు.
రాష్ట్రసాధన కోసం చావో రేవో తేల్చుకునేందుకు 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. కేసీఆర్ దీక్ష తెలంగాణ అంతటా ఉద్య మ స్ఫూర్తి రగిల్చింది. తెలంగాణ యావత్తూ భగ్గుమంది. తెలంగాణ ఉద్యమాలు చరిత్ర పుటల్ని సువర్ణాక్షరాలతో లిఖిం చి, శాంతి మార్గంలో లక్ష్య తీరాలను చేరాయి. కేసీఆర్ దీక్షతో దిగొచ్చిన కేంద్రం తెలంగాణకు అనుకూలంగా డిసెంబర్ 9న ప్రకటన చేసింది. అయితే ఆ సంతోషం నిలవలేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలు అంటూ.. తెలంగాణపై కేంద్రం సాగదీత వైఖరి అవలంబించింది. దాంతో ఇటు ఉద్యోగుల్ని, అటు విద్యార్థుల్ని, మరోపక్క తెలంగాణ ప్రజల్ని ఏకం చేసి ఊరు వాడ ఉప్పెనలా చేశారు కేసీఆర్.
స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడిన కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్కు తెలంగాణ జనం పట్టం కట్టారు. ఉద్యమ నాయకుడే పాలకుడైన చోట పాత విలువలకు పాతరేసి, కొత్త విలువలతో కూడిన సమాజ నిర్మాణం జరుగుతున్నది. ఈ ఏడేండ్లలో దేశమంతా తెలంగాణ అంటే కేసీఆర్,కేసీఆర్ అంటే తెలంగాణ అంటున్నది.
తల్లికి మెతుకు పెట్టనోడు, పినతల్లికి బంగారు గాజులు తొడుగుతానని బీరాలు పలికినట్లున్నది బీజేపీ తీరు. దేశం కోసం, ధర్మం కోసం అని అక్కరలేకున్నా అరిచేటోళ్లు.. వన్ నేషన్ వన్ నేషన్ అని నినదించే వాళ్లు.. వ్యాక్సిన్ ధరల్లో వత్యాసాలు ఎందుకో చెప్పరు. వారికి కావలసింది రాజకీయమే తప్ప ప్రజల అభివృద్ధి కాదు. అధికారం కోసం ఎంతకైనా తెగించే గుంటనక్కలు అవి. తెలంగాణ కోసమే అహర్నిశలు కృషి చేస్తున్న కేసీఆర్ కంటికి రెప్పల్లా నిలవటం… త్యాగాల పునాదులపై అవతరించిన తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం బాధ్యత.
(వ్యాసకర్త: న్యాయవాది, తెరాస రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ)
శుభ ప్రద్ పటేల్ .ఎన్