హైదరాబాద్ : రాష్ట్రంలో యూనివర్సిటీలకు అతి త్వరలో కొత్త వైస్ ఛాన్స్లర్లు రానున్నారు. ఈ మేరకు వీసీల నియామకానికి ప్రభుత్వం ప్రతిపాదనలను తయారు చేసింది. ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురు పేర్లను ప్రతిపాదిస్తూ నియామక దస్త్రాన్ని సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రతిపాదిత నియామక దస్త్రాన్ని ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు పంపింది. ఆమె ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో ఉండటంతో దస్త్రానికి ఆన్లైన్లో ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం.
దస్త్రానికి గవర్నర్ ఆమోదం తెలిపితే నేడో, రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని ఓయూ, కాకతీయ, జేఎన్టీయూహెచ్, శాతవాహన, అంబేద్కర్, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలుగు విశ్వవిద్యాలయం వర్సిటీలకు కొత్త వీసీలు రానున్నారు. 2019 జూన్ నుంచి వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలుగా ఐఏఎస్ అధికారులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.