మానుకోట జిల్లాలో ఏటా పెరుగుతున్న సాగు
2016-17లో కేవలం ఐదు ఎకరాలు
2020-21లో 159 ఎకరాలకు పెరిగిన విస్తీర్ణం
ఉద్యాన పంటల వైపు రైతుల చూపు
ప్రోత్సహిస్తున్న అధికారులు
మహబూబాబాద్, మార్చి 17, (నమస్తే తెలంగాణ):పుచ్చకాయల సాగుతో మంచి లాభాలు వస్తుండడంతో మానుకోట జిల్లా రైతులు మక్కువ చూపుతున్నారు. ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తుండడంతో అన్నదాతలు క్రమంగా కర్బూజ సాగువైపు మళ్లుతున్నారు. 2016లో కేవలం ఐదెకరాల్లోనే సాగు చేయగా, 2020-21లో ఏకంగా 159ఎకరాల్లో పంట వేశారు. 70 నుంచి 90 రోజుల్లో కాయలు చేతికి రానుండగా, ఎకరానికి రూ.20వేల పెట్టుబడి పోను సగటున రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు.
పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ
ఎకరాకు విత్తనాలు మినహాయిస్తే సుమారు రూ.20వేల పెట్టుబడి అవుతుంది. విత్తనాలు 50గ్రాముల పుచ్చగింజలు రూ.300-రూ.3,600మధ్య ఉన్నాయి. రైతు ఏ రకం విత్తనం కావాలంటే ఆ విత్తనం నాటుకోవచ్చు. 50గ్రాముల ప్యాకెట్ 7గుంటల నుంచి 8గుంటల వరకు వస్తుంది. వాటర్ మిలన్ ఐస్బాక్స్ వెరైటీ మాత్రం 50గ్రాముల ప్యాకెట్కు రూ.3,600 వరకు ఉంది. ఈ విత్తనం ద్వారా వచ్చే పుచ్చకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇవి జిల్లా కేంద్రంలోనే కాకుండా ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. మామూలు రకం పుచ్చకాయలు మార్కెట్లో టన్నుకు రూ.6వేల వరకు ఉండగా, మేలు రకం విత్తనాలతో సాగయిన పుచ్చకాయలకు టన్నుకు రూ.10వేల నుంచి రూ.12వేల వరకు ధర పలుకుతున్నది. విత్తన రకాన్ని బట్టి 70 రోజుల నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరంలో 20 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. పెట్టుబడి రూ.20వేలు పోను సగటున ఎకరాకు రూ.లక్షదాకా ఆదాయం వస్తుంది. ఏటా ఎండాకాలం ప్రారంభానికి సరిగ్గా మూడు నెలల ముందు డిసెంబర్ చివరి వారం, జనవరి మొదటి వారంలో పుచ్చపంటను రైతులు సాగు చేస్తారు. మార్చి చివరి వారానికి పంట చేతికొస్తుంది. మేలైన విత్తనాలతో సాగయిన పంట టన్నుకు రూ.12వేలు పలుకుతుంది. పుచ్చ సాగుకు పెట్టుబడి తక్కువే అయినా వడగళ్లు పడితే మాత్రం నష్టాలు తప్పవని రైతులు చెబుతున్నారు. పుచ్చలో దోమకాటు ప్రభావం ఎక్కువ ఉంటుంది. దోమకాటుకు గురైతే ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి సంబంధిత మందులు పిచికారీ చేయాలి.
గతేడాది రూ.4లక్షల ఆదాయం
గత ఏడాది నాలుగెకరాల్లో పుచ్చకాయలు సాగు చేశా. అప్పుడు మాములు రకం విత్తనం వేశా. ఎకరాకు రూ.20వేల పెట్టుబడి పోను రూ. లక్ష ఆదాయం వచ్చింది. నాలుగు ఎకరాలకు రూ. 4లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది వాటర్ మిటన్ ఐస్బాక్స్ వెరైటీ రకాన్ని సాగు చేశా. ఈ రకం ముంబై, ఢిల్లీకి ఎక్కువగా ఎగమతి అవుతుంది. ఈ రకం పుచ్చకాయలు టన్నుకు రూ.12వేలు పలుకుతాయి. ఈ పంట ఏప్రిల్ చివరి వారం, మే మొదటి వారం చేతికి వస్తుంది. సాధారణ రకమైతే ఇప్పటికే కోతకు వచ్చాయి.
రైతులకు అవగాహన కల్పిస్తున్నం
జిల్లాలో ఐదేళ్ల నుంచి పుచ్చసాగు పెరుగుతూ వస్తున్నది. పుచ్చసాగుకు పెట్టుబడి ఎంత.. లాభాలు ఎంత వస్తాయనే అంశాలపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తున్నం. జిల్లాలో ఇప్పుడిప్పుడే పుచ్చ సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. పుచ్చకాయల సాగుతో రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ఇప్పటికే జిల్లాలో చామగడ్డ, గుమ్మడికాయలు, తదితర రకాల కొత్త పంటలపై రైతులకు అవగాహన కల్పించాం. సాగు కూడా చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం ఉండే పంటలవైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం.
-సూర్యనారాయణ, జిల్లా ఉద్యాన శాఖాధికారి, మహబూబాబాద్