న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ ముమ్మరంగా వ్యాప్తి చెందిన సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తన ఆక్సిజన్ అవసరాలను నాలుగు రెట్లు అధికంగా చూపిందని సర్వోన్నత న్యాయస్ధానం ఆక్సిజన్ ఆడిట్ బృందం నివేదిక వెల్లడించిన క్రమంలో ఆప్ సర్కార్పై బీజేపీ విరుచుకుపడింది. సుప్రీంకోర్టు ఆక్సిజన్ ఆడిట్ రిపోర్టు దిగ్భ్రాంతికరమని, ఇది ఆప్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలకు అద్దం పడుతున్నదని కాషాయ పార్టీ దుయ్యబట్టింది.
ఏప్రిల్ 25 నుంచి మే 10 మధ్య ఆక్సిజన్ అవసరాలను ఢిల్లీ ప్రభుత్వం అనూహ్యంగా పెంచిందని పేర్కొంది. ఢిల్లీ సర్కార్ తీరుతో దేశ రాజధానికి అదనపు ఆక్సిజన్ సరఫరాలతో అధిక కేసులు నమోదైన 12 రాష్ట్రాల్లో ఆక్సిజన్ సంక్షోభం తలెత్తిందని ఆడిట్ కమిటీ నివేదిక పేర్కొంది. కొవిడ్-19 వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరాలను రాజకీయం చేశాయని బీజేపీ నేత సంబిట్ పాత్ర పేర్కొన్నారు. ఆక్సిజన్ ఆడిట్ కమిటీ నివేదికలో గణాంకాలు దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించారు. ఆప్ చిల్లర రాజకీయాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.