హైదరాబాద్ : రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన గిఫ్ట్ ఏ స్మైల్కు విశేష స్పందన లభిస్తోంది. గతేడాది తన జన్మదినం సందర్భంగా ఆరు అంబులెన్స్లను విరాళంగా ప్రకటించిన కేటీఆర్.. ఈసారి వికలాంగులకు మూడు చక్రాల ద్విచక్ర వాహనాలను విరాళంగా ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఓ ఐదు మందికో, పది మందికో కాదు.. ఏకంగా వంద మంది వికలాంగులకు తన జన్మదిన సందర్భంగా ఆ వాహనాలను పంపిణీ చేస్తానని తెలిపారు. గతేడాది కేటీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి 100 అంబులెన్స్లను విరాళంగా అందజేశారు. ఈ ఏడాది కూడా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి అదే స్థాయిలో స్పందన వస్తోంది. కేటీఆర్ను ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగుజాడల్లో నడిచే వారంతా తాము కూడా వికలాంగులకు వాహనాలను విరాళంగా ఇస్తామని ముందుకు వస్తున్నారు.
మంత్రి అజయ్ కుమార్ 50 బైక్లను విరాళంగా ప్రకటించగా, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ 100, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 60, ఎమ్మెల్యేలు బాల్క సుమన్ 50, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు 20, గ్యాదరి కిశోర్ కుమార్ 20 బైక్లను విరాళంగా ఇస్తామన్నారు. టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ఒక బైక్ను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి.. ఒక దివ్యాంగుడికి అండగా ఉంటానని తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జీవన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములం అవుతామని ప్రకటించారు.