గాంధీనగర్, ఆగస్టు 13: దేశంలోని రహదారులపై ఫిట్నెస్లేని వాహనాలు తిరగకుండా చేయడానికి వాహన తుక్కు విధానం దోహదపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ విధానంతో పర్యావరణ కాలుష్యం తగ్గడంతోపాటు దాదాపు రూ.10వేల కోట్లు పెట్టుబడులు, వేలాదిమందికి ఉపాధి లభించే ఆస్కారం ఉన్నదని అభిప్రాయపడ్డారు. గుజరాత్లో జరిగిన పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన ‘స్వచ్ఛంద వాహన తుక్కు విధానా’న్ని ప్రారంభించారు. వాహనం జీవనకాలాన్ని బట్టికాకుండా.. ఫిట్నెస్ సరిగ్గాలేదని తెలిసినా ఆ వాహనాన్ని తుక్కుగానే పరిగణిస్తామన్నారు. తుక్కుగా మారిన వాహనాలకు ధ్రువపత్రం జారీచేస్తారని.. దీంతో కొత్త వాహనం కొనుగోలు చేసే సమయంలో రిజిస్ట్రేషన్ రుసుమును తీసుకోరని, వాహన పన్నులపై కూడా రాయితీ లభిస్తుందని చెప్పారు.
ఏమిటీ ఈ విధానం?
ఫిట్నెస్ సరిగ్గాలేని, కాలంచెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు వాహన తుక్కు విధానాన్ని తీసుకొచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్లోనే ఈ విధానాన్ని ప్రకటించారు.
ఎందుకు ఈ విధానం?
కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ధ్యేయంగా ఈ పాలసీని తీసుకొచ్చారు. కొత్త వాహనాలతో పోలిస్తే ఫిట్నెస్లేని, కాలం చెల్లిన వాహనాలు10-12 రెట్లు ఎక్కువగా పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని అంచనా. దేశీయ వాహనాల చట్టం ప్రకారం.. వ్యక్తిగత వాహనాల జీవితకాలం 20 ఏండ్లుకాగా, వాణిజ్య వాహనాల జీవితకాలం 15 ఏండ్లు. అయితే, కాలం చెల్లిన దాదాపు 51 లక్షల వ్యక్తిగత వాహనాలు, 17 లక్షల వాణిజ్య వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని అంచనా.
తుక్కుగా మార్చే నిబంధనలు ఏమిటి?
కాలంచెల్లిన అన్ని వాహనాలను ఈ విధానం కింద తుక్కుగా మార్చబోరు. నిర్ణీత కాలం ముగిసిన అనంతరం వాహనానికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షలో వాహనం ఫిట్నెస్ మెరుగ్గానే ఉన్నదని తేలితే, ఐదేండ్లపాటు చెల్లుబాటయ్యేలా రెన్యువల్ సర్టిఫికెట్ను జారీచేస్తారు. ఆ వ్యవధి ముగియగానే మళ్లీ ఫిట్నెస్ టెస్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనం ఫిట్నెస్ మెరుగ్గాలేదని తేలితే తుక్కుగా మారుస్తారు.
వాహనాన్ని తుక్కుకు ఇస్తే లాభం ఏమిటి?
ఫిట్నెస్ సరిగ్గాలేని వాహనాన్ని తుక్కు కోసం ఇస్తే ఒక ధ్రువపత్రాన్ని జారీచేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసేప్పుడు ఈ ధ్రువపత్రాన్ని చూపిస్తే వాహనం ఖరీదులో 4-6 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, రోడ్డు ట్యాక్స్లో 25 శాతం రిబేట్, ఉచితంగా రిజిస్ట్రేషన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.