హైదరాబాద్ : తెలంగాణ కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల వరుసగా రోజువారీ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా శనివారం వెయ్యికిపైగా నమోదవడంతో ఆందోళన రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,078 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. మహమ్మారి ప్రభావంతో మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా 331 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం 6900 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని, 3,116 మంది బాధితుల హోం ఐసోలేషన్లో ఉన్నట్లు చెప్పింది.
తాజాగా నమోదైన కేసులు అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే 283 ఉన్నాయి. శుక్రవారం ఒకే రోజు 59,705 కొవిడ్ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,819కి చేరింది. మృతుల సంఖ్య 1,712కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.55శాతం ఉండగా.. రికవరీ రేటు 97.22 శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ తర్వాత రంగారెడ్డిలో 104, మేడ్చల్ మల్కాజ్గిరిలో 113, నిజామాబాద్లో 75, సంగారెడ్డిలో 46, జగిత్యాలలో 40, నిర్మల్లో 40, కరీంనగర్లో 34 కేసులు రికార్డయ్యాయి.