మారేడ్పల్లి, మే 24: గోపాలపురం పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పురిటి నొప్పులతో రోడ్డుపైకి వచ్చి ఆటోల కోసం యత్నిస్తున్న నిండు గర్భిణిని పోలీస్ పెట్రోకార్లో దవాఖానకు తీసుకెళ్లారు. సికింద్రాబాద్ అంబేద్కర్నగర్లో ఉంటున్న రమేశ్ భార్య స్వాతి నిండు గర్భిణి. బొమ్మలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. సోమవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో రోడ్డు మీదకు వచ్చి ఆటో కోసం ప్రయత్నిస్తున్నారు. సంగీత్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద తనిఖీలు చేపడుతున్న గోపాలపురం పోలీసుల వద్దకు వచ్చి ఆటో కావాలని విషయాన్ని చెప్పారు. దీంతో ఇన్స్పెక్టర్ సాయిఈశ్వర్గౌడ్ ఆదేశంతో కానిస్టేబుల్ ధన్రాజ్, హోంగార్డు సిద్ధిరాములు పోలీసు పెట్రోకార్ వాహనంలో ఆమెను తీసుకెళ్లి కోఠిలోని ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం కాన్పు చేస్తామని వైద్యులు చెప్పినట్లు బంధువులు తెలిపారు.