హైదరాబాద్: సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం బస్ భవన్లో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. వారం రోజుల క్రితం సజ్జనార్ను ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా రవాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ కొనసాగారు. అయితే ఐపీఎస్ ఆఫీసర్ను ఆర్టీసీ ఎండీ నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్.. కార్పొరేషన్ ఎండీగా నియమితులయ్యారు.