నిర్మల్: చదువుల తల్లి కొలువై ఉన్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. వసంత పంచమి కావడంతో ఆలయానికి భారీగా తరలి వచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో బారులు దీరారు. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుందని భక్తుల నమ్మకం. దీంతో పెద్దఎత్తున భక్తులు తమ పిల్లలకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారు.
వసంత పంచమి ఉత్సవాలకు జ్ఞాన సరస్వతి ఆలయాన్ని అధికారులు ముస్తాబు చేశారు. తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకంతో వేదపండితులు ఉత్సవానికి అంకురార్పణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చదువుల తల్లికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ, అభిషేకం, పూర్ణాహుతి, మహావిద్యా హోమం, బలిదానం, గణపతి హోమం, చండీయాగం, కుంకుమార్చన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర భారతదేశం నుంచి భక్తులు పెద్ద ఎత్తున బాసరకు రానున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇబ్బందిపడకుండా మండపాలు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.