న్యూఢిల్లీ : కరోనా వైరస్ రోజువారీ కేసులు భారీగా తగ్గుముఖం పట్టడంతో దేశంలో కొవిడ్-19 రికవరీ రేటు 93.1 శాతానికి పెరిగిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. రికవరీ రేటు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 93.1 శాతానికి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 377 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువగా ఉందని చెప్పారు. మే 7న మహమ్మారి ముమ్మర దశతో పోలిస్తే ప్రస్తుతం రోజువారీ కేసులు 68 శాతం తగ్గాయని వెల్లడించారు. తాజా కేసుల్లో 66 శాతం కేసులు ఐదు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైరస్ ను స్ధానికంగా కట్టడి చేయగలిగారని అన్నారు.