ముషీరాబాద్, ఆగస్టు 5: హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ.. దళితుల ఓట్లు చీల్చే కుట్ర చేస్తున్నాయని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఇందులో భాగంగానే తెరవెనుక మంద కృష్ణమాదిగను బరిలోకి దించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు సిద్ధాంతాలను పక్కన పెట్టి రాజకీయ స్వార్థం కోసం జట్టుకట్టాయని, దళితులకు సంక్షేమ ఫలాలు అందకుండా కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం హైదరాబాద్ విద్యానగర్లోని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో దళితులంతా టీఆర్ఎస్కే అండగా నిలవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఇది మింగుడుపడని దళిత ద్రోహులు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారయని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నడూ లేనట్టు జనరల్ సీటులో ఎస్సీ అభ్యర్థిని బరిలో నిలపడానికి ప్రయత్నిస్తుండటం, తెరవెనక బీజేపీతో కలిసి మహాజన పార్టీ తరఫున మంద కృష్ణను బరిలోకి దించే ప్రయత్నం చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దళితులకు శాశ్వత శత్రువులని, వారిని రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడు నమ్మడని స్పష్టంచేశారు. దళితుల బాగుకోసం సీఎం కేసీఆర్ దళిత బంధు అమలుకు పూనుకుంటే మంద కృష్ణ దానికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు.