కమలాపూర్, సెప్టెంబర్ 9: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ దళిత వాడల్లోకి వస్తే అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్లో ఎమ్మార్పీఎస్ టీఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం వంగపల్లి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల ఆస్తులు జప్తు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో మాట్లాడితే ఈటల రాజేందర్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. జై శ్రీరాం అనకుంటే దళితులపై దాడులు చేస్తానన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. దళిత వ్యతిరేక పార్టీలో చేరిన ఈటల రాజేందర్కు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆయన బీజేపీలో చేరినప్పుడే అణగారిన వర్గాలకు దూరమైనట్టు చెప్పారు. మైనార్టీలు, దళితులపై అణచివేత ధోరణి అవలంబిస్తున్న ఆ పార్టీని హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.