తుంగభద్ర నదీజలాల వివాదాలకు శతాబ్దానికి పైగా చరిత్ర వుంది. ఈ వివాదాలు అపరిష్కృతంగా ఉండటానికి కారణం నదీ పరీవాహక ప్రాంతమంతా ఎడారులను మరిపించే కరువు పరిస్థితులే. నీటి లభ్యతతో పోల్చితే అవసరాలు చాలా ఎక్కువ. బచావత్ ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా 1970లో- తుంగభద్ర (కర్ణాటక రాష్ట్రం) లోయలో వ్యవసాయ అవసరాలు తీరాలంటే అప్పటికే నిర్మించిన, నిర్మాణంలో వున్న ప్రతిపాదిత సాగునీటి ప్రాజెక్టులకు 535.61 టీఎంసీల నీటిని కేటాయించాలని కర్ణాటక విజ్ఞప్తి చేసింది.
చాలినంత నీటి లభ్యత లేనందున కర్ణాటక రాష్ట్రంలో వినియోగానికి కేవలం 290 టీఎంసీల తుంగభద్ర జలాలనే బచావత్ ట్రిబ్యునల్ అప్పుడు కేటాయించింది. తుంగభద్రకు మరో పరీవాహక రాష్ట్రమైన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 126.26 టీఎంసీల నీటిని కేటాయించింది. నీటి అవసరాల కోసం ఈ రెండు రాష్ర్టాలు పలు కొత్త ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నాయి. ఈ పరిస్థితులు మరిన్ని వివాదాలను తెరపైకి తెస్తున్నాయి. కొత్తగా తలెత్తిన వివాదాలు అప్పర్ తుంగ, అప్పర్ భద్ర, సింగట్లూర్ ఎత్తిపోతల పథకాలు కర్ణాటకలో, రాజోలిబండ కుడి ప్రధాన కాల్వపైనే. ఈ ప్రాంతాల్లోని పరిస్థితులను, బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును పరిశీలిస్తే వాస్తవాలేమిటో అర్థమవుతాయి.
పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వతం ‘గంగమూల’ వద్ద ప్రారంభమయ్యే తుంగ నది చిక్మగళూర్, షిమోగ జిల్లాల గుండా 147 కిలోమీటర్లు ప్రవహించి షిమోగ పట్టణానికి సమీపంలోని ‘కూడలి’ గ్రామం వద్ద భద్రానదిలో కలుస్తుంది. భద్రానది కూడా చిక్మగళూర్ జిల్లాలోని ముదిగెరె తాలూకా గంగమూల వద్దే మొదలై తూర్పు దిశలో ప్రవహించి తుంగ నదితో కలుస్తుంది. తుంగ, భద్ర కలిసిన ‘కూడలి’ నుంచి దీన్ని తుంగభద్రా నదిగా వ్యవహరిస్తారు. ఈ నది 531 కి.మీ. ప్రయాణించి తెలంగాణలోని ఆలంపూర్ సమీపంలో సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తున్నది. కర్ణాటక రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో 30 శాతం తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతం. 23 శాతం జనాభా ఈ నదీ లోయలో నివసిస్తున్నది.
ఈ ప్రాంతంలోని దుర్భిక్ష పరిస్థితులను, ప్రజల ఆర్థిక, సాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అప్పర్ తుంగ ప్రాజెక్టుకు 12 టీఎంసీలు, అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 10 టీఎంసీలు, సింగట్లూర్ ఎత్తిపోతల పథకానికి మరో 18 టీఎంసీలు మొత్తం 40 టీఎంసీలు కేటాయిస్తూ తొలి తీర్పునిచ్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలుపుతూ ఈ నీటిలో తమ రాష్ర్టానికి కూడా కేటాయింపులు చేస్తూ పునః పంపిణీ చేయాలని వాదించింది. ఆంధ్రప్రదేశ్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్ రాజోలిబండ కుడి ప్రధాన కాల్వ డిమాండ్ 1969 నుంచి ఉన్నందున 4 టీంఎసీల నీటిని కర్ణాటక ప్రాజెక్టులకు తగ్గించి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తూ 2013లో మరో తీర్పునిచ్చింది. దీంతో తుంగ, భద్రా ఉపనదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేటాయించిన 40 టీఎంసీల నుంచి 4 టీఎంసీలు తగ్గించడం వల్ల ఆ రాష్ట్ర వాటా 36 టీఎంసీలుగా భావించాలి.
2010 చివరలో వెలువడిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాగానే కర్ణాటక తమ పూర్వ వాటాకు అదనంగా సమకూరిన 36 టీఎంసీల వినియోగానికి చర్యలు చేపట్టింది. తుంగా నది నుంచి 17.4 టీఎంసీలు భద్రానదికి లిఫ్ట్ చేసి, భద్రా నది నుంచి 29.9 టీఎంసీలు అప్పర్ భద్రా రిజర్వాయర్కు లిఫ్ట్ ద్వారా మళ్లించాలని నిర్మాణ పనులు ప్రారంభించింది. అప్పర్ భద్రా కాల్వల ద్వారా ఈ ప్రాంతంలోని 367 చెరువులకు 10.86 టీఎంసీలను (వని విలాస్సాగర్కు మళ్లిస్తున్న 2 టీఎంసీలను కలుపుకొని) మిగిలిన 19 టీఎంసీలతో 2,25,515 హెక్టార్లకు (5,57,022 ఎకరాలు) సాగు నీరందించాలని అనుమతుల కోసం కేంద్ర జల సంఘానికి ప్రతిపాదనలు పంపించింది. ‘30 శాతం పనులు పూర్తిచేసిన తర్వాత మా వద్దకు వస్తారా?’ అని కేంద్ర జల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు కొనసాగుతున్న వాదనలన్నీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ర్టాలకు కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి మాత్రమే. కానీ, ఈ సాకుతో ఇతర చిన్నా, పెద్ద ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలకు కర్ణాటక ప్రయత్నిస్తే కచ్చితంగా అడ్డుకోవలసిందే. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అధికారికంగా ప్రకటించకముందే తుంగ, భద్ర నదులపై ప్రాజెక్టులకు 36 టీఎంసీలను కర్ణాటక, రాజోలిబండ కుడి కాల్వకు 4 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళించడం తొందరపాటు చర్య అవుతుంది. జలాల మళ్లింపు మాత్రం ట్రిబ్యునల్ తుది తీర్పు తర్వాతే జరగాలి. కృష్ణా జలాల లభ్యత కన్నా బేసిన్ అవసరాలు ఎక్కువ కాబట్టి మొత్తం కృష్ణా జలాల వినియోగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర పర్యవేక్షణ అవసరం. తుంగభద్ర, ఇతర ఉప నదుల జలాల పంపిణీ, వినియోగంపై రాష్ర్టాల మధ్య వివాదాలు తరచుగా తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ‘కృష్ణా వ్యాలీ రివర్ అథారిటీ’ని చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేయాలి. బ్రిజేష్ కుమార్ తుది తీర్పు వెలువడేనాటికైనా ఈ అథారిటీ పని ప్రారంభిస్తే జల వివాదాలు తలెత్తవు.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అధికారికంగా ప్రకటించకముందే తుంగ, భద్ర నదులపై ప్రాజెక్టులకు36 టీఎంసీలను కర్ణాటక, రాజోలిబండ కుడి కాల్వకు 4 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళించడం తొందరపాటు చర్య అవుతుంది. జలాల మళ్లింపు మాత్రం ట్రిబ్యునల్ తుది తీర్పు తర్వాతే జరగాలి.
తుంగభద్ర, ఇతర ఉప నదుల జలాల పంపిణీ, వినియోగంపై రాష్ర్టాల మధ్య వివాదాలు తరచుగా తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ‘కృష్ణా వ్యాలీ రివర్ అథారిటీ’ని చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేయాలి. బ్రిజేష్ కుమార్ తుది తీర్పు వెలువడేనాటికైనా ఈ అథారిటీ పని ప్రారంభిస్తే జల వివాదాలు తలెత్తవు.
(వ్యాసకర్త:వి.ప్రకాశ్ సీనియర్ రాజకీయ విశ్లేషకులు)