హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రవాణా సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ల పంపిణీకి డ్రోన్లను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు పౌర విమానాయానశాఖ ఆమోదం కూడా లభించింది. కేంద్ర హోంశాఖ క్లియరెన్స్ లభించాల్సి ఉన్నది. పైలట్ ప్రాజెక్టును వికారాబాద్ ఏరియా దవాఖాన కేంద్రంగా చేపట్టనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రాంతాలవారికి సహాయం అందించేందుకు ఆకాశమార్గాలను వినియోగించుకొనే వెసులుబాటు ఉండాలని, ఇందుకు డ్రోన్లను ఉపయోగించడాన్ని పరిశీలించాలని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు 2019లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్లో సూచించారు. అప్పటినుంచే రాష్ట్రంలో డ్రోన్ల ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయోగాలు సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆఫ్ ఐటీఈ అండ్ సీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నది. దీనిపై అధ్యయనానికి 2020లో 16 దరఖాస్తులొచ్చాయి. అందులో 7 వికారాబాద్ జిల్లాలో ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యాయి. గత నెల 29న పౌర విమానయానశాఖ (ఎంవోసీఏ) కూడా విజువల్ లైన్ ఆఫ్ విజన్ (వీఎల్వోఎస్) విధానంలో డ్రోన్ల ద్వారా మందులు లేదా వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం డీజీసీఏ మద్దతుతో బీవీఎల్వోఎస్ డ్రోన్ల ద్వారా ఈ ప్రాజెక్టుకు చేపట్టేందుకు ఆమోదం పొందింది.