టీకా అందుబాటులోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇంకా ఎన్నో అనుమానాలు.. అపోహలు. మొదటిడోస్ తీసుకున్న చాలామందికి రెండో డోస్ కోసం ఎవరిని, ఎప్పుడు సంప్రదించాలో తెలియని పరిస్థితి. వచ్చే నెల 1వ తేదీ నుంచి 18 ఏండ్లు నిండిన వారందరూ టీకాలు వేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. దీంతో కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న కొన్ని అనుమానాలను నిపుణుల సమాధానాలతో నివృత్తి చేసే ప్రయత్నం ఇది.
వ్యాక్సిన్ కచ్చితంగా వేసుకోవాలా?
వ్యాక్సిన్ వేసుకున్నవారికి కరోనా నుంచి రక్షణ కలుగుతున్నదని అధ్యయనాలు తేల్చాయి. కాబట్టి టీకా తీసుకుంటేనే ఉత్తమం.
జ్వరం, జలుబు, దగ్గు వంటివి ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోవచ్చా?
జ్వరంతో ఉన్నవారికి వ్యాక్సిన్ వేయరు. తగ్గిన తర్వాతే తీసుకోవాలి. జలుబు, దగ్గు వంటి సాధారణ లక్షణాలు ఉంటే వేస్తారు.
కరోనా సోకి ఐసొలేషన్లో ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోవచ్చా?
కరోనా చికిత్స పొందుతున్న వారికి టీకా వేయరు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎలాగూ శరీరంలో ప్రతిరక్షకాలు ఏర్పడుతాయి. కాబట్టి కొంతకాలం ఆగి వ్యాక్సిన్ వేసుకోవచ్చు.
టీకా వేసుకున్నవారు రక్తదానం చేయొచ్చా?
రెండో డోస్ తీసుకున్న తర్వాత 4 వా రాల వరకు రక్తదానం చేయడానికి వీల్లేదు.
ఏ వ్యాక్సిన్ మంచిది?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని వ్యాక్సిన్లు సమర్థంగానే పనిచేస్తున్నాయి. మన దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ ఇస్తున్నారు. ఎలాంటి తీవ్ర ప్రభావాలు కనిపించలేదు. ఇతర దేశాల్లో ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్-వీ వంటివి కోట్ల మందికి వేశారు. అవన్నీ సురక్షితమేనని తేలింది. కాబట్టి అందుబాటులో ఉన్న ఏ టీకా అయినా వేసుకోవచ్చు.
గర్భిణులు, బాలింతలు టీకా వేసుకోవచ్చా?
ప్రస్తుతానికి గర్భిణులకు టీకాలు వేయడం లేదు. బాలింతలు టీకా వేసుకోవచ్చు. తల్లుల్లో ఏర్పడిన ప్రతిరక్షకాలు.. తల్లిపాల ద్వారా పిల్లలకు చేరుతున్నట్టు తాజా పరిశోధనల్లో తేలింది.
రెండో డోస్ ఎప్పుడు వేసుకోవాలి?
కొవిషీల్డ్ అయితే మొదటి డోస్ వేసుకున్న తర్వాత 4-8 వారాల్లోపు, కొవాగ్జిన్ తీసుకున్నవారు 4-5 వారాల్లోగా రెండో డోస్ వేసుకోవాల్సి ఉంటుంది.
సెకండ్ డోస్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
రెండో డోస్ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కొవిన్ సాఫ్ట్వేర్ ఆటోమెటిక్గా తేదీని నిర్ణయించి మొబైల్కు సమాచారం అందిస్తుంది. చెప్పిన తేదీన, నిర్దేశిత సమయానికి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్తే టీకా వేస్తారు. ఒకవేళ తేదీ ఖరారు కాకపోతే www.cowin.gov.in వెబ్సైట్కు వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
రెండో డోస్ కోసం మళ్లీ అదే కేంద్రానికే వెళ్లాలా? మార్చుకోవచ్చా?
మొదటి డోస్ వేసిన కేంద్రంలోనే రెండో డోస్ వేసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో టీకా కేంద్రం మార్చుకునే అవకాశం ఉంటుంది. అందుకు కొవిన్ యాప్లో వినతి పెట్టుకోవచ్చు. ఏ తేదీన, ఏ కేంద్రానికి వెళ్లాలనుకుంటున్నారో తెలుపాలి. కారణం సరైనదని భావిస్తే అధికారులు కేంద్రాన్ని మార్చే అవకాశం ఉంటుంది.
సెకండ్ డోస్ వేసుకున్నవారికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
మొదటి డోస్ వేసుకున్న తర్వాత కొందరికి తలనొప్పి, జలుబు, జ్వరం వంటివి కనిపించినా.. రెండో డోస్ తర్వాత చాలామందిలో దుష్ప్రభావాలు కనిపించడం లేదు. ఒకవేళ మొదటిడోస్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటే ఇప్పుడు జ్వరం, సూది గుచ్చిన చోట నొప్పి వంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండొ చ్చు. అదికూడా కొందరిలో మాత్రమే.
జ్వరం రాకుంటే వ్యాక్సిన్ పనిచేయనట్టేనా?
ఇది అపోహ మాత్రమే. మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు, రాకపోవచ్చు.
సెకండ్ డోస్ వేసుకున్న తర్వాత కూడా కరోనా సోకుతుందా?
రెండో డోస్ వేసుకున్న తర్వాత కనీసం రెండు వారాలకు పూర్తిస్థాయిలో ప్రతిరక్షకాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అప్పటివరకు తప్పనిసరిగా కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాల్సిందే.
రెండో డోస్ వేసుకున్న వెంటనే కొవిడ్ బారిన పడితే రక్షణ ఉంటుందా?
పూర్తిస్థాయిలో ప్రతి రక్షకాలు ఏర్పడకపోయినా.. రెండు డోసులు తీసుకున్న తర్వాత దవాఖానకు వెళ్లాల్సిన ముప్పు తగ్గుతున్నదని అధ్యయనాలు చెప్తున్నాయి.
ధ్రువపత్రం కచ్చితంగా తీసుకోవాలా? రాకపోతే ఎవరిని సంప్రదించాలి?
టీకా వేసుకున్న తర్వాత కచ్చితంగా ధ్రువపత్రం తీసుకోవాలి. కొన్ని దేశాలు టీకా వేసుకున్న విదేశీయులను మాత్రమే అనుమతిస్తున్నాయి. ఒకవేళ ధ్రువపత్రం రాకపోతే కొవిన్ యాప్ నుంచి లేదా.. www.cowin.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా అనుమానాలు ఉంటే 1075 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయవచ్చు.
నిర్దేశిత గడువులోగా సెకండ్ డోస్ వేసుకోకపోతే ఏమవుతుంది?
ప్రతిరక్షకాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందవు. ఆ డోస్ పనికిరాకుండా పోతుంది. కొవిడ్-19 వైరస్ను తట్టుకునే శక్తి శరీరానికి ఉండదు. నిర్దేశిత గడువు దాటితే.. మళ్లీ మొదటి డోస్ వేసుకోవాల్సి ఉటుంది.
సాధారణ మెడికల్ షాప్లలో టీకాలు లభిస్తాయా?
ఆ పరిస్థితి ఉండదు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో మాత్రమే టీకా లు లభిస్తాయి. నిర్దేశిత ధర చెల్లించి టీకా వేసుకోవాల్సి ఉంటుంది.
వ్యాక్సిన్ ఉచితంగా వేస్తారా?
ప్రస్తుతం 45 ఏండ్లకు పైబడిన వారికి, ఫ్రంట్లైన్ వారియర్లకు, దీర్ఘకాలిక రోగులకు ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా టీకాలు వేస్తున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో ఒక్కో డోస్కు రూ.250 వసూలు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి ధరలు టీకాల ధరలు పెరుగనున్నాయి. ఉచితంగా అందించడం ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రైవేట్లో మాత్రం నిర్దేశిత ధర చెల్లించాల్సి ఉంటుంది.
18 ఏండ్లు దాటిన వారి రిజిస్ట్రేషన్లు ఎప్పుడు మొదలవుతాయి?
ఈ నెల 28వ తేదీ నుంచి మొదలవుతాయి. కొవిన్ యాప్ లేదా www.cowin.gov.in వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
ఒక ఫోన్ నంబర్ మీద ఎంత మంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు?
ఒక ఫోన్ నంబర్పై నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కచ్చితంగా అదేరోజు వెళ్లాల్సిందేనా?
వీలుకాకపోతే కొవిన్ యాప్ లేదా వెబ్సైట్లో తేదీని, సమయాన్ని మార్చుకునే అవకాశం ఉంది.
మనకు నచ్చిన వ్యాక్సిన్ వేసుకునే స్వేచ్ఛ ఉంటుందా?
ప్రస్తుతం ఆ స్వేచ్ఛ లేదు. ఉత్పత్తి, సరఫరా పెరిగిన తర్వాత మనకు నచ్చిన దవాఖానలో, నచ్చిన టీకా వేసుకునే వెసులుబాటు రావొచ్చు.
వ్యాక్సినేషన్ సందర్భంగా ఇచ్చే సమాచారానికి భద్రత ఉందా?
పూర్తి సురక్షితం. పైగా.. పేరు, వయసు, లింగం, ఫోన్ నంబర్ వంటి ప్రాథమిక సమాచారం మాత్రమే సేకరిస్తున్నారు. కాబట్టి అనుమానాలు అవసరం లేదు.