భారత మహిళల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. దాదాపు ఏడేండ్ల తర్వాత మిథాలీసేన టెస్టు సమరంలో తలపడనుంది. నేటి నుంచి ఇంగ్లండ్తో జరిగే ఏకైక టెస్టుతో మళ్లీ తెల్ల జెర్సీల్లో టీమ్ఇండియా అమ్మాయిలు మెరవనున్నారు. సంప్రదాయ ఫార్మాట్లో ఇంగ్లిష్ గడ్డపై అజేయ రికార్డును కొనసాగించాలని పట్టుదలగా ఉన్న భారత జట్టుకు ప్రాక్టీస్ లేమి సవాల్గా మారింది. అయితే గతంలో హ్యాట్రిక్ టెస్టు విజయాలు గుర్తుచేసుకొని సానుకూల దృక్పథంతో దిగి సత్తాచాటాలని మిథాలీ అండ్ కో తహతహలాడుతున్నది.
బ్రిస్టల్: ఇంగ్లండ్ గడ్డపై మెరుగైన రికార్డు, సీనియర్ ప్లేయర్లతో పటిష్టంగా ఉన్న భారత మహిళల జట్టు సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు సమరానికి సిద్ధమైంది. బుధవారం నుంచి ఇక్కడ జరిగే ఏకైక టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ను మిథాలీసేన ఢీకొట్టనుంది. 2014 నవంబర్ తర్వాత భారత మహిళలకు ఇదే తొలిటెస్టు. చివరగా దక్షిణాఫ్రికాతో టెస్టు ఆడిన కెప్టెన్ మిథాలీ రాజ్ సహా ఏడుగురు ప్లేయర్లు ప్రస్తుత జట్టులో ఉన్నారు. అయితే సారథితో పాటు వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జులన్ గోస్వామి సహా భారత ప్లేయర్లు ఇటీవలి కాలంలో ఎర్రబంతి మ్యాచ్లు ఆడకపోవడం కాస్త ప్రతికూలంశం. అలాగే కరోనా వైరస్ ప్రభావం కారణంగా బయోబబుల్లో ఉండాల్సి రావడంతో మిథాలీసేన సరైన ప్రాక్టీస్ కూడా చేయలేకపోయింది.
మిథాలీ, హర్మన్ప్రీత్, మంధానతో కూడిన భారత బ్యాటింగ్ దళం పటిష్టంగా కనిపిస్తుంటే.. టెస్టు అరంగేట్రంలోనే దూకుడుతో దూసుకెళ్లాలని యువ ప్లేయర్ షెఫాలీ వర్మ పట్టుదలగా ఉంది. అనుభవం, యువరక్తం మేళవింపుతో ఉన్న టీమ్ఇండియా సమిష్టిగా రాణిస్తే ఇంగ్లండ్ బౌలర్లకు సొంత గ్రౌండ్లో చెమటలు పట్టడం ఖాయమే. జులన్ గోస్వామి, శిఖా పాండే సుదీర్ఘ స్పెల్స్ ఎలా వేస్తారో చూడాలి. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్ కూడా గెలుపుపై ధీమాతో ఉంది. 2014లో భారత్తో టెస్టు ఆడిన ఆరుగురు ప్లేయర్లు ఇప్పుడు ఇంగ్లండ్ జట్టులో ఉన్నారు. భారత జట్టులో అత్యధికంగా మిథాలీ, జులన్కు 10 టెస్టులు ఆడిన అనుభవం ఉండగా.. వీరిద్దరూ 2002లో ఇంగ్లండ్పై ఒకే మ్యాచ్లో అరంగేట్రం చేశారు.