గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో టీకాయే మనకు ఆయుధం అని గవర్నర్ తమిళిసై అన్నారు. అందరూ టీకా తీసుకొని కోవిడ్ నుంచి రక్షణ పొందాలన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తండాలో సోమవారం గిరిజనులతో కలిసి గవర్నర్ రెండో డోసు టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. కోవిడ్ నియంత్రణకు, వ్యాక్సినేషన్కు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో ప్రణాళికా బద్ధంగా వ్యాక్సినేషన్ నడుస్తున్నదన్నారు. జడ్పీ చైర్పర్సన్ అనిత హరినాథ్రెడ్డి మాట్లాడుతూ.. గిరిజనుల్లో వ్యాక్సిన్పై ఉన్న అపోహలు తొలగించడానికి గవర్నర్ ఇక్కడికి రావడం హర్షణీయమని చెప్పారు. గవర్నర్ భర్త డాక్టర్ సౌందర్రాజన్, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, సీపీ మహేశ్ భగవత్, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత, కేసీ తండా సర్పంచి మోతీలాల్ పాల్గొన్నారు. వ్యాక్సిన్ తీసుకోడానికి ముందు గవర్నర్ దంపతులు మహేశ్వరంలోని శివగంగ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.