హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ ముప్పున్న అటో, క్యాబ్, మ్యాక్సీక్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేకడ్రైవ్ ద్వారా 20 రోజుల్లో పది కేంద్రాల్లో 2లక్షల మందికిపైగా టీకా ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో క్యాబ్, ఆటోడ్రైవర్లకు ఇచ్చే వ్యాక్సినేషన్ సెంటర్ను తనిఖీచేశారు. లైసెన్స్ కలిగిన డ్రైవర్లు రవాణాశాఖ వెబ్సైట్లో పేర్లను నమోదుచేసుకొంటే, మొబైల్కు మెసేజ్ వస్తుందని, వారిని మాత్రమే వ్యాక్సినేషన్ సెంటర్లోకి అనుమతిస్తున్నామని అధికారులు సీఎస్కు వివరించారు. వ్యాక్సినేషన్ సెంటర్లలో కొవిన్ పోర్టల్లో డ్రైవర్ల రిజిస్ట్రేషన్ చేస్తారని, నేరుగా వచ్చేవారికి టీకా ఇవ్వడం లేదని తెలిపారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం రవాణాశాఖ అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని సీఎస్ అభినందించారు. కార్యక్రమంలో రవాణాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సునీల్శర్మ, నగర పోలీస్కమీషనర్ అంజనీకుమార్, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలో జన సహాయకులకు నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. బుధవారం 73వేల మందికి టీకాలు వేశారు. 54 వేల మందికి తొలిడోసు, 19 వేల మందికి రెండో డోసు వేసినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది.