అమ్మిన వ్యక్తే తిరిగి పట్టా చేసుకుండు
అధికారుల నిర్వాకంతో ఆదివాసీలకు ఇక్కట్లు
పెంబి: ఓ వ్యక్తి దురాలోచన.. అధికారుల నిర్వాకం ఓ ఊరినే ముంచింది. అమ్మిన భూమిని గ్రామస్థులకు తెలియకుండా తిరిగి పట్టా చేసుకోవడంతో ఆదివాసీలు అయోమయంలో పడిపోయారు. నిర్మల్ జిల్లా పెంబి అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు పెంబికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన మందపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తుల వద్ద 55/2 సర్వే నంబర్లో ఏడెకరాల అసైన్డ్భూమిని కొనుగోలు చేసి, 2000 సంవత్సరంలో కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు అప్పటి మంత్రి, ప్రస్తుత టీఆర్ఎస్ నేత వేణుగోపాలాచారి చొరవచూపారు. సుమారు 50 కుటుంబాలు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. వేణుగోపాలాచారి సహాయానికి గుర్తుగా వారు తమ గ్రామానికి ‘వేణునగర్’గా నామకరణం చేసుకున్నారు. ఆ తర్వాత 2002లో పెంబికి చెందిన గన్నారపు సురేందర్ ఆదివాసీలకు తెలియకుండా, వారు భూమి కొన్న వ్యక్తుల నుంచి 4.34 ఎకరాలను తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని, అసైన్డ్ భూమిని పట్టాభూమిగా మార్చుకున్నాడు. గ్రామంలో మొత్తం భూమి తనదేనంటూ సురేందర్ ఇటీవల గ్రామస్థులతో చెప్పడంతో వారు కంగుతిన్నారు. నివాస స్థలాలను తన భూమిగా పట్టా చేసుకొని దానిపై ఏడాదికి రూ.47,500 రైతుబంధు పొందడం గమనార్హం. నివాస స్థలాలపై డబ్బులు సదరు రైతు ఖాతాలో జమ అవుతున్నా కనీసం వ్యవసాయ అధికారులు గుర్తించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఈ విషయంపై గ్రామస్థులు శనివారం తాసిల్దార్ రాజ్మోహన్కు వినతిపత్రం అందజేశారు.