హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు దవాఖానలు వ్యాక్సిన్లను తయారీచేస్తున్న కంపెనీల నుంచి నేరుగా సమీకరించుకోవాల్సి ఉంటుందని వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్రం అనుమతిచ్చినట్టు వెల్లడించింది. ప్రభుత్వ దవాఖానల్లో మాదిరే ప్రైవేటు దవాఖానల్లోనూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించిది. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉండదని, స్లాట్ ప్రకారమే టీకా వేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. 45 ఏండ్లు పైబడినవాళ్లు కొవిన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని, 18-44 ఏండ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో కేంద్రం వెసులుబాటు ఇచ్చిందని వివరించింది. రాష్ట్రంలో వారికి టీకా ఇచ్చే తేదీని త్వరలో వెల్లడిస్తామని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు జీ శ్రీనివాస్రావు మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు.