హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. తొలిదశలో ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్లైన్ వారియర్లకు ప్రారంభమైన టీకా పంపిణీ ఇప్పటికే 75శాతం వరకు పూర్తయినట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. తొలుత వ్యాక్సిన్ పట్ల అవగాహన లేకపోవడం, ఇతర అపోహల కారణంగా వైద్యసిబ్బందిలో కొందరు ముందుకు రాలేదని, ఆ తర్వాత కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని విభాగాలవారు టీకా తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఇప్పటికీ వైద్యారోగ్య సిబ్బందికి టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నదని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 3 లక్షల వరకు ఆరోగ్యసిబ్బంది, 2 లక్షల వరకు ఫ్రంట్లైన్ వారియర్లు ఉంటారని అంచనా వేసిన అధికారులు.. ఆ దిశగా వ్యాక్సినేషన్కు ఏర్పాట్లుచేశారు. ఇప్పటివరకు ఆరోగ్యసిబ్బందిలో 2.23 లక్షల మంది తొలిడోస్ తీసుకోగా, 1.69 లక్షల మంది రెండు డోసులు వేసుకున్నారు. ఫ్రంట్లైన్ వారియర్లలో 1.13 లక్షల మంది తొలిడోస్ తీసుకోగా, 64,861 మంది రెండు డోసులు వేసుకున్నారు. రెండోదశలో 60 ఏండ్లు పైబడినవారు, 45 ఏండ్లు పైబడిన దీర్ఘకాలిక రోగుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు అధికారులు వివరించారు. ముందస్తు రిజిస్ట్రేషన్ వీలుకానివారికి స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 3.89 లక్షల మంది 60 ఏండ్లు పైబడినవారు, 45 ఏండ్ల దీర్ఘకాలిక రోగులు 2.02 లక్షల మంది తొలిడోస్ తీసుకున్నట్టు పేర్కొన్నారు.
పీహెచ్సీల్లోనూ వ్యాక్సినేషన్
ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పీహెచ్సీ స్థాయిలోనూ టీకా కేంద్రాలను ఏర్పాటుచేయగా, రెండుమూడు రోజుల్లో వాటి సంఖ్యను మరింత పెంచనున్నారు. పలు ప్రైవేట్ దవాఖానలు సైతం టీకా పంపిణీలో పాల్గొంటామని కోరగా, కేంద్రం నుంచి అనుమతి కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. పలు ప్రైవేట్ దవాఖానలు టీకా పేరిట అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఒకటి రెండు దవాఖానల వ్యాక్సిన్ పం పిణీ లైసెన్స్ రద్దుచేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇవీ కూడా చదవండీ
సెప్టెంబర్ నాటికి రెండో కొవిడ్ వ్యాక్సిన్ : అదర్ పూనవాలా
త్వరలో క్యాన్సర్ వ్యాధికి టీకా.. జర్మన్ శాస్త్రవేత్త దంపతుల దృష్టి
ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ ఆర్-ఫ్యాక్టర్