వర్ధంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్వయం పాలన స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్రచరిత్రలో చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన ఉద్యమస్ఫూర్తిని స్మరించుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్రంలో సబ్బండవర్ణాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని తెలిపారు.
తెలంగాణభవన్లో ఘననివాళి
ప్రొఫెసర్ జయశంకర్ కలగన్న బంగారు తెలంగాణ నిర్మాణం సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాకారమవుతున్నదని హోం మం త్రి మహమూద్అలీ పేర్కొన్నారు. తెలంగాణభవన్లో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కే కేశవరావు, పార్టీ నేతలు గోవర్ధన్రెడ్డి, అలీబాక్రీ, పార్టీ కార్యాలయ ఇన్చార్జి నాయినేని రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. రవీంద్రభారతిలో జయశంకర్ చిత్రపటానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాళులర్పించారు. టీఎన్జీవో భవన్లో జయశంకర్సార్ చిత్రపటానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ నివాళులర్పించారు.