పైరు పచ్చగా పెరగాలంటే యూరియా అవసరం. పంట పిలకలు వేసి అధిక దిగుబడి వచ్చేందుకు యూరియా అవసరం. పంట రకాన్ని బట్టి ఎకరాకు ఒకటి నుంచి రెండు బస్తాలదాకా వాడుతుంటారు. వ్యవసాయపనులు
ప్రారంభమవుతున్నాయంటే చాలు రైతులు ట్రాక్టర్లు వేసుకుని ఎరువుల దుకాణాలకెళ్లి ట్రక్కుల నిండా తెచ్చుకుంటారు. యూరియా కోసం పట్టణాల్లో రైతులు పడిగాపులు కాసిన రోజులూ ఉన్నాయి. ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు. ఇప్పటిదాకా ఘన రూపంలో బస్తాల్లో లభించిన యూరియా..
త్వరలో లిక్విడ్ రూపంలో డబ్బాల్లో దొరుకనున్నది.
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు ఘనరూపంలో లభిస్తున్న యూరియా.. ఇకపై ద్రవ రూపంలోనూ దొరుకనున్నది. ప్రపంచంలోనే తొలిసారిగా ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) ద్రవరూప యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇఫ్కో తన నూతన ప్రొడక్ట్ను బుధవారం ఆవిష్కరించింది. జూన్లోనే ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా రైతులు అవసరానికి మించి యూరియాను వాడుతున్నారు. దీంతో భూసారం తగ్గడంతోపాటు పలురకాల కాలుష్యాలకు కారణమవుతున్నది. యూరియా వాడకాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషించాలని కేంద్రం.. ఎరువుల కంపెనీలను కోరింది. ఈ నేపథ్యంలో సంప్రదాయ యూరియాతో పోల్చితే లాభాలు అధికంగా ఉండి, పర్యావరణానికి అంతగా హానికలిగించని లిక్విడ్ యూరియాను తయారుచేయాలని ఇఫ్కో నిర్ణయించింది.
నేరుగా మొక్క వేర్లకు..
ఇఫ్కో నానో యూరియా లిక్విడ్ను 500 మిల్లీలీటర్ల బాటిళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నది. ఒక బాటిల్లో 40వేల పీపీఎం నైట్రోజన్ కలిగి ఒక యూరియా బస్తాకు సమానమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఘనరూప యూరియాతో పోల్చితే ద్రవరూపంలోని యూరియా నీళ్లలో త్వరగా కలిసిపోవడంతో మొక్క వేర్లకు నేరుగా చేరుతుంది. దీంతో వృథా తగ్గి.. 50శాతం వరకు వాడకం తగ్గే అవకాశం ఉంటుంది. లిక్విడ్ వల్ల నీటి, నేల, వాయు కాలుష్యం భారీగా తగ్గుతుంది.
రైతుకు తగ్గనున్న భారం
లిక్విడ్ యూరియాతో రైతుకు అనేక రకాల భారం తగ్గనున్నది. యూరియా బస్తాతో పోల్చి తే లిక్విడ్బాటిల్ ధర రూ.10 తక్కువగా ఉం టుంది. ప్రస్తుతం బాటిల్ ధరను రూ.240గా నిర్ణయించారు. ఘన యూరియాతో పోల్చితే లిక్విడ్ యూరియాతో దిగుబడి పెరుగుతుందని సంస్థ నిర్వహించిన ప్రయోగాల్లో తేలింది. అన్నిపంటల్లోనూ కనీసం 8 శాతం దిగుబడి అధికంగా ఉంటుందని తేలింది. లిక్విడ్ బాటిల్స్తో రవాణా, నిలువ ఖర్చు భారీగా తగ్గనునున్నది.
94 పంటలపై ప్రయోగం
నానో యూరియా లిక్విడ్పై ఇఫ్కో సంస్థ అనేకదశల్లో ప్రయోగాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా సుమారు 11 వేల ఫార్మర్ ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించింది. ఇందులోభాగంగా 94 పంటలపై లిక్విడ్ను ఉపయోగించి పరిశోధనలు చేసింది. 20 ఐసీఏఆర్ పరిశోధనా సంస్థలు, రాష్ర్టాల వ్యవయసాయ విశ్వవిద్యాలయాలు, కేవీకేలలో 43 పంటలపై నేషనల్ అగ్రికల్చర్ రిసెర్చ్ సిస్టమ్ (ఎన్ఏఆర్ఎస్) బహుళ పంటలపై ప్రయోగాలు నిర్వహించింది. వీటిఆధారంగా ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్సీవో 1985)లో చేర్చారు.