హైదరాబాద్ : నగరంలోని కాప్రా పాంతంలో ఉన్న ఎవాక్యూ భూముల కబ్జా కేసుపై ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కబ్జాకు గురైన భూమికి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి కబ్జా చేశానని తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. భూకబ్జాదారులపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు అని తెలిపారు. ప్రభుత్వ భూమి కబ్జా అవుతుందని స్థానికులు తహసీల్దార్కు చెప్పారు. కబ్జాకు గురైన భూమి వద్దకు రెవెన్యూ అధికారులు వెళ్తే దాడికి ప్రయత్నించారు. కేసులు నమోదైన వారే తమపై కేసుల నమోదుకు ఫిర్యాదు చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలి. విచారణ తర్వాత నిజనిజాలు బయటకు వస్తాయి. విచారణ అనంతరం తనపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.