హైదరాబాద్ : నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్కు అందరికీ సుపరిచితమే. ప్రేమికులకు అయితే ఆ పార్కు అడ్డా అని చెప్పొచ్చు. ఇక ఎన్నో మీటింగ్లకు ఆ పార్కు వేదిక అని కూడా చెప్పొచ్చు. ఈ తరుణంలో పార్కులో ప్రశాంత వాతావరణం దెబ్బ తింటోందని పార్కు నిర్వాహకులు ఓ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయం కాస్త రివర్స్ అయింది. దీంతో తాము తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. అదేంటంటే.. పెళ్లి కాని జంటలకు ఇందిరా పార్కులోకి అనుమతి లేదని ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని దుయ్యబట్టారు.
ఇక నుంచి మిమ్మల్ని భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ఇందిరా పార్కులోకి ప్రవేశం ఉంటుంది అని సందేశం వచ్చేలా కార్టూన్లను నెటిజన్లు జోడించి కామెంట్ చేశారు. పార్కు బయట రూ. 50కి పార్క్ ఎంట్రీ మ్యారేజ్ సర్టిఫికెట్ అనే వ్యాపారం కూడా చేసుకోవచ్చు అని విమర్శించారు. పార్కులోకి వెళ్లాలంటే పెళ్లిని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని కొందరు ప్రశ్నించారు. పెళ్లైన జంట పార్కులో అలా చేయరని గ్యారెంటీ ఉందా? అని అడిగారు.
ఈ ఫ్లెక్సీ ఏర్పాటుపై సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ స్పందించారు. ఆ బ్యానర్లను అర్బన్ బయోడైవర్సిటీ డివిజన్ అధికారులు తొలగించారని పేర్కొన్నారు. పార్కులోకి వెళ్లేవారికి అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నామని, పార్కులో నిఘా పెంచాలని స్థానిక పోలీసులకు సమాచారం అందించామని జోనల్ కమిషనర్ తెలిపారు.