హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి 21 అంశాలతో విజన్ డాక్యుమెంట్ను రూపొందించామని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ పేర్కొన్నా రు. ఆరు నెలల స్వల్పకాలిక, మూడేండ్ల దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. వర్సిటీని పరిశోధనాలయంగా తీర్చిదిద్దడానికి రిసెర్చ్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఈసారి నుంచి క్యాంపస్ విద్యార్థులకు ఆధార్ తరహా యూనిక్ ఐడీ నంబర్ కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. చిప్ నిక్షిప్తంచేసిన బార్కోడ్ కలిగి ఉన్న ఐడీకార్డు ఇస్తామని, దీనిని స్కాన్ చేసుకుని.. కాలేజీలు, గ్రంథాలయాలు, హాస్టళ్లు, పరీక్షల సమయంలో ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించనున్నామని అన్నారు. రవీందర్తో ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..
పలు కొత్త కోర్సులు
కాలానుగుణంగా కొత్త కోర్సులు తీసుకొస్తాం. పీజీలో పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ స్టడీస్, కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ ఆనర్స్, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో బీబీఏ, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో మైనింగ్ కోర్సులను ప్రవేశపెట్టనున్నాం. కొత్త విద్యావిధానం ప్రకారం కోర్సులు, కరిక్యులం రూపకల్పనకు డీన్స్తో కమిటీవేశాం. డిగ్రీ, పీజీల్లో ఏ కోర్సునైనా చదువుకునే వెసులుబాటు కల్పించాలనుకుంటున్నాం.
ల్యాబ్ టు ల్యాన్
వర్సిటీలో రిసెర్చ్పై ప్రత్యేక దృష్టిసారించాం. ఇందుకు డీఆర్డీవో, ఐఐసీటీ వంటి సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నాం. ఓయూలో జరుగుతున్న పరిశోధనను ప్రపంచానికి తెలియజేసేందుకు ‘ల్యాబ్ టు ల్యాన్’ ప్రాజెక్టుకు రూపకల్పనచేశాం. ఆరునెలలకో ఎగ్జిబిషన్, షోకేజ్, ఓపెన్ హౌజ్లను నిర్వహిస్తాం. పరిశోధనలను స్టార్టప్లుగా అభివృద్ధికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం.
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్..
మంత్రి కేటీఆర్ సూచనల మేరకు టాస్క్ ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నాం. ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను, కొన్ని విభాగాలను విలీనంచేసి హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుచేస్తున్నాం.
సివిల్ సర్వీసెస్ అకాడమీ
విద్యార్థులు సివిల్స్ సర్వీసెస్లో రాణించేందుకు ప్రత్యేకంగా సివి ల్ సర్వీసెస్ అకాడమీని ఏర్పాటుచేసి తర్ఫీదునిస్తాం. 24/7 పనిచేసే గ్రంథాలయం, రీడింగ్ రూం కాంప్లెక్స్ను నెలకొల్పుతాం.