హైదరాబాద్ : తెలంగాణ ఆయిల్ పామ్ ప్రణాళిక అభినందనీయం అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగుకు వంద శాతం సబ్సిడీ విషయాన్ని పరిశీలిస్తాం అని ఆమె చెప్పారు. మొదటి దశలో 3 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగడంపై వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రాన్ని అభినందించారు.
బీఆర్కే భవన్లో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజేతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమై రాష్ట్ర వ్యవసాయ ప్రగతి, వ్యవసాయ పథకాలను వివరించారు.
ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల మీద దృష్టి సారించాలి. ఎగుమతులు పెరగితేనే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. అన్ని పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చినట్లే ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు పరిశ్రమల శాఖ ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యవసాయ, ఉద్యాన అధికారులతో పాటు పరిశ్రమల అధికారులతో ఒక బృందం ఏర్పాటు చేయాలి. దేశంలో మనం పండించిన పంటలు అధిక శాతం మనం వినియోగానికే పరిమితం అవుతున్నాయి. పంటల సాగులో ఎరువులు, రసాయనాల వినియోగం తగ్గించి, వరి ధాన్యం, కూరగాయలు, పండ్ల ఉత్పత్తిలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినప్పుడే ఇతర దేశాలకు ఎగుమతి చేయగలుగుతాం. ఈ దిశగా రైతులు దృష్టి సారించాలి. అధికారులు రైతులను చైతన్యం చేయాలి. వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజలతో పాటు పప్పుగింజల సాగుకు తప్పకుండా సహకారం అందిస్తాం. పంట ఉత్పత్తులకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ప్రతి రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలి. డిజిటలైజేషన్ కు ప్రాధాన్యతనివ్వాలి అని మంత్రి శోభ కరంద్లాజే అన్నారు.