సిటీబ్యూరో, జూన్ 2(నమస్తే తెలంగాణ): లోన్యాప్ల కేసులో సైబర్క్రైమ్ పోలీసుల అవతారమెత్తి కోల్కతా ఐసీఐసీఐ బ్యాంకుకు టోకరా వేసిన ఘటనలో సూత్రధారులను హైదరాబాద్ సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించారు. కోల్కతా నుంచి హైదరాబాద్లోని ఎస్బీఐ బ్యాంకులోని ఆనంద్ జన్ను అనే వ్యక్తి ఖాతాకు రూ. 1.18 కోట్లు బదిలీ కావడం, అక్కడి నుంచి ఆ డబ్బు గురుగావ్, ఢిల్లీ ఖాతాలకు బదిలీ అయినట్లు సిటీ సైబర్క్రైమ్ పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగా ఆనంద్ జన్నును అదుపులోకి తీసుకోవడంతో ఈ డొంక కదిలినట్లు సమాచారం.
లోన్ యాప్ల కేసులో హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు వందల సంఖ్యలో ఉన్న బ్యాంకు ఖాతాల్లో రూ. 400 కోట్లు ఫ్రీజ్ చేశారు. వీటిలో కోల్కతాలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న అనీజ్ ఎంటర్ప్రైజెస్, నిస్ టెక్నాలజీస్ పేరుతో ఉన్న కరెంట్ ఖాతాల్లో రూ. 1.18 కోట్లు ఫ్రీజ్ అయ్యాయి. వీటిని విడిపించేందుకు కోల్కతా సైబర్క్రైమ్ పోలీసులమంటూ నకిలీ లేఖలు సృష్టించి.. అక్కడి బ్యాంకు అధికారులకు లోన్యాప్కు సంబంధించిన నేరగాళ్లు బురిడీ కొట్టించి, ఆ ఖాతాలను డీఫ్రీజ్ చేశారు.
ఢీ ఫ్రీజ్ అయిన ఖాతాల్లో నుంచి సొమ్మును హైదరాబాద్లోని ఎస్బీఐ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఇక్కడి నుంచి మరిన్ని ఖాతాల్లోకి బదిలీ చేశారు. పక్కా ఫ్లాన్తో లోన్యాప్ల కేసులు ఎదుర్కొంటున్నవారే ఈ నకిలీ వ్యవహారాన్ని నడిపినట్లు పోలీసులు గుర్తించి, ఆ దిశగా దర్యాప్తు జరపడంతో విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో పాటు కోల్కతాలో సూడో పోలీసులుగా బ్యాంకుకు వెళ్లిన వారి సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించారు.