న్యూఢిల్లీ: భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. విశ్వక్రీడల 100, 200 మీటర్ల మహిళల పరుగులో పతకం కోసం పోటీపడనుంది. టోర్నీల్లో అర్హత మార్కును సాధించడంలో ద్యుతి కాస్తలో విఫలమైనా ర్యాంకింగ్స్ ఆధారంగా టోక్యో బెర్త్ దక్కించుకుంది. ప్రస్తుతం 100 మీటర్ల విభాగంలో 44వ, 200 మీటర్లలో 51వ ర్యాంకులో ఉన్న ఈ ఒడిశా చిరుత రెండు విభాగాల్లోనూ క్వాలిఫై అయింది. గతవారం ఇండియన్ గ్రాండ్ ప్రి-4లో 11.17 సెకన్లలో 100 మీటర్ల లక్ష్యాన్ని చేరిన ద్యుతికి కేవలం 0.02 సెకన్లలో తేడాతో ఒలింపిక్ క్వాలిఫికేషన్ చేజారింది. తెలంగాణకు చెందిన జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ దిశానిర్దేశంలో ముందుకు సాగుతున్న ద్యుతి.. చాలాకాలం పాటు హైదరాబాద్లోని సాయ్ గోపీచంద్ అకాడమీలోనూ శిక్షణ తీసుకుంది. మరోవైపు గాయంతో బాధపడుతున్న యువ సంచలనం హిమాదాస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. కాగా స్విమ్మర్ శ్రీహరి నటరాజన్ టోక్యో బెర్త్ దక్కించుకున్నాడు.