దిలావర్పూర్, ఏప్రిల్ 15: నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో గురువారం 24వ జైన తీర్థాంకుడు, జైనమతానికి జీవంపోసిన వర్తమాన మహావీరుని ప్రతిమను గుర్తించినట్టు చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరాజు తెలిపారు. నిర్మల్ జిల్లాతోపాటు దిలావర్పూర్లో వేల సంవత్సరాల చరిత్రగల అనేక శిల్పాలు బయటపడుతున్నాయి. గతించిన చరిత్రకు సాక్షులుగా రాష్ట్రకూటులు, కల్యాణి చాళుక్యులు, తొలి కాకతీయ కాలంలో బాసర, భైంసా, దిలావర్పూర్ గ్రామాలు జైన కేంద్రాలుగా వెలుగొందాయి. ప్రస్తుతమున్న దిలావర్పూర్ గ్రామం పదోశతాబ్దం వరకు జైనుల కేంద్రంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. దిల్వారా కాలక్రమేణ దిలావర్పూర్గా రూపాంతరం చెందిందన్నారు. జైనుల పరిభాషలో దిల్వారా అంటే దేవాలయాలున్న భూమి అని అర్థమని, అందుకే ఈ గ్రామంలో ప్రాచీన ఆలయాలు ఉన్నాయని తెలిపారు. నేటికీ ఈ గ్రామంలో పురాతన బావులు, ఆలయాలు అక్కడక్కడా దర్శనమిస్తున్నాయని చెప్పారు.