పెద్ద సంఖ్యలో ఆశావహులు
గెలుపు గుర్రాల ఎంపికలో పార్టీ ముఖ్యుల తలమునకలు
సర్వేల ఆధారంగా అవకాశాలు
అయోమయంలో ప్రత్యర్థి పార్టీలు
అన్ని డివిజన్లలోనూ అభ్యర్థులు కరువు
వరంగల్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ముగిసింది. 66 డివిజన్లలో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థిత్వం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పార్టీ గెలుపు ఖాయమనే అభిప్రాయాలు బలంగా పాతుకుపోయాయి. గులాబీ పార్టీ టికెట్ దక్కితే గెలుపు కచ్చితమనే ఉద్దేశంతో ఎక్కువ మంది టీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో గ్రేటర్ వరంగల్ సమగ్రాభివృద్ధి సాధించింది. ఆరున్నరేళ్లలో వరంగల్ మహానగర రూపురేఖలు మారిపోయా యి. వరంగల్ను మహానగరంగా తీర్చిదిద్దిన టీఆర్ఎస్కు ఇక్కడి ప్రజలు మరోసారి మద్దతు తెలిపే అవకాశాలు మెండుగా ఉండడంతో ఆ పార్టీ టికెట్ కోసం ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలోనూ టీఆర్ఎస్ తరఫున ఒకరి కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. గులాబీ టికె ట్ వస్తే గెలుపు ఖాయమనే ధీమా అందరిలోనూ ఉం ది.
పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, ఎన్నికల ఇన్చార్జి బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎన్నికల వ్యూహం అమలవుతున్నది. గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, టీ రాజయ్య ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక చేపడుతున్నారు. ఆశావహుల్లో గెలుపు అవకాశాలను ప్రాతిపదికగా తీసుకుని ఎంపిక చేయాలని పార్టీ అధిష్ఠానం స్పష్టం చేసింది. ఈ మేరకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఎప్పటికప్పుడు సర్వేలు చేసి ప్రజల్లో ఆదరణ ఉన్న వారికి అవకాశం ఇచ్చేలా ముందుకుపోతున్నారు.
ప్రత్యర్థి పార్టీలు ఆగం
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మరోసారి స్పష్టమైన ఆధిక్యత వచ్చే పరిస్థితి ఉందని ప్రతిపక్ష బీజేపీ, కాం గ్రెస్ ఇప్పటికే అంచనాకు వచ్చాయి. గత ఎన్నికల కంటే అత్యధిక స్థాయిలో సీట్లు గెలిచే అవకాశం ఉండడంతో ప్రత్యర్థి పార్టీల తరఫున బరిలో నిలిచేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీలకు తీవ్ర ప్రతికూల ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో 58 డివిజన్లకు కాంగ్రెస్ 4, బీజేపీ 1తో సరిపెట్టుకున్నాయి. ఐదేళ్ల పాలనలో టీఆర్ఎస్ రూ.1500 కోట్ల తో వరంగల్ మహానగరాన్ని అభివృద్ధి చేసింది. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలుతో టీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుంచి బరిలో నిలిచేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. అభ్యర్థుల కోసం ఆ పార్టీ ల ముఖ్యులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. స్వతంత్రులుగా బరిలో నిలిచిన వారిని ఒప్పించి బీఫారాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియలోనే టీఆర్ఎస్ టికెట్ల కోసం ఎక్కువమంది పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఈ అం శమే ఆ పార్టీ గెలుపు అవకాశాలను స్పష్టం చేస్తోంది.