ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి
ములుగు, జూలై 26: రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించటం గర్వకారణమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి సోమవారం రామప్ప దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో అభివృద్ధి నమూనా చిత్రపటాలను ఆవిష్కరించి కేక్ కట్ చేసి పటాకులు కాల్చి సంబురాలు చేసుకొన్నారు. యునెస్కో గుర్తింపుతో దేవాలయం పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నదని సత్యవతి రాథోడ్ అన్నారు. గుర్తింపు కోసం కృషిచేసిన కాకతీయ హెరిటేజ్ ప్రతినిధులు పాండురంగారావు, పాపారావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం యావత్తు తెలంగాణ ప్రజలు సంబురపడే విషయమన్నారు. ఆలయాన్ని యునెస్కో నిబంధనల ప్రకారం అభివృద్ధిచేసి పర్యాటక రం గంలో దేశంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎమ్మెల్యేలు సీతక్క, గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు, వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్లు కుసుమ జగదీశ్వర్, గండ్ర జ్యోతి, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్రావు, వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, రాష్ట్ర రుణ విమోచన అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ ఏరువ సతీశ్రెడ్డి, ఏఎస్పీ సాయిచైతన్య తదితరులు పాల్గొన్నారు.