హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్వరాష్ట్రంలో కాకతీయ శిల్ప సంపద, సంస్కృతి, కళారంగాలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. పాలంపేటలోని రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం హోదా సాధించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. వారసత్వ గుర్తింపు కోసం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణభవన్లో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, మాలోతు కవిత, పీ రాములు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న తరువాత ప్రజల జీవితాలను బాగుచేయటమే కాకుండా అనేక చారిత్రక, వారసత్వ ప్రాంతాల పురోభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని నామా నాగేశ్వర్రావు తెలిపారు. కాకతీయుల గొలుసుకట్టు చెరువుల స్ఫూర్తిని కొనసాగిస్తూ మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టారని గుర్తుచేశారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు సాధించాలని 2018లో ప్రధాని నరేంద్రమోదీని కలిసి సీఎం స్వయంగా విజ్ఞప్తిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.
సీఎం కృషి ఫలితం
రామప్ప వంటి కట్టడాలకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొస్తూనే మరోవైపు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అత్యద్భుతంగా నిర్మిస్తున్నారని నామా పేర్కొన్నారు. ఆరియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కింద తెలంగాణలో కేవలం 8 కట్టడాలే ఉన్నాయని, ఇంకా అనేక కట్టడాలను గుర్తించాల్సిన అవసరం ఉందని ఎంపీ బండా ప్రకాశ్ తెలిపారు. నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేసిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు చెప్పారు. రామప్పకు యునెసో గుర్తింపు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. యునెస్కో గుర్తింపుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీ మాలోతు కవిత ఆశాభావం వ్యక్తంచేశారు. రామప్పకు వారసత్వ హోదా రావటంపై రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.