మేడారం: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పండుగలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రజలు సంతోషంగా పండుగలు చేసుకునే వాతావరణం కల్పించారని చెప్పారు. వనదేవతలు కొలువైన మేడారంలో చిన్న జాతర నేడు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను మంత్రి దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా ముందుగా ములుగులోని గట్టమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మేడారం జాతరకు టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నదని, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మవార్లను దర్శించుకునేలా ప్రచారం నిర్వహిస్తున్నదని చెప్పారు. భక్తులకు రవాణా, ఇతర వసతులు కల్పిస్తున్నదని తెలిపారు. చిన్న జాతర బుధవారం ప్రారంభమవుతుందని, ఈనెల 27వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారన్నారు.