జగిత్యాల: కరోనా కేసులు అధికమవుతుండంతో జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలుచేస్తున్నారు. జిల్లాలోని పెగడపల్లి మండలం బతికపల్లిలో గత కొన్నిరోజులు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి పాలకమండలి అత్యవసరంగా సమావేశమై.. గ్రామంలో రెండు వారాలపాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. దీంతో నేటి నుంచి ఈనెల 26 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని గ్రామ సర్పంచ్ శోభారాణి ప్రకటించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఉదయం 6 నుంచి 11 గంటల వరకు దుకాణాలు తెరచుకోవచ్చని, 11 గంటల తర్వాత దవాఖానలు, మెడికల్ దుకాణాలు మినహా అన్నీ మూసివేయాలని, ఒకవేళ తెరిచి ఉంచితే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలు మాస్కు లేకుండా ఎట్టిపరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో తిరగడానికి వీల్లేదని, నిబంధనలను అతిక్రమించినవారికి జరిమానా విధిస్తామని ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..