కేపీహెచ్బీకాలనీ, సెప్టెంబర్ 23: కూకట్పల్ల్లి సర్కిల్ కార్యాలయంలో వేర్వేరు విభాగాలకు చెందిన ఇద్దరు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కూకట్పల్లి సర్కిల్ పరిధి ఆస్బెస్టాస్కాలనీకి చెందిన నాగరాజు తన ఆస్తికి సంబంధించి మ్యుటేషన్, మరోవైపు ట్రేడ్ లైసెన్స్లో పేరు మార్పుకోసం రెండు నెలలుగా సర్కిల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పని కావాలంటే పైసలు ఖర్చవుతాయని రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ చాంద్పాషా, పారిశుద్ధ్య విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ షణ్ముఖ్ లంచం డిమాండ్ చేశారు. నాగరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్కు చెందిన ఏసీబీ డీఎస్పీలు ఫయాజ్, రవీందర్రెడ్డి, సీఐలు రాజు, రేణుక, మరో బృందంగా డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో ఏకకాలంలో సర్కిల్ కార్యాలయంలో గురువారం దాడులు చేశారు. రూ.8 వేలు లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ చాంద్పాషా, రూ.2,500 లంచం తీసుకుంటూ కంప్యూటర్ ఆపరేటర్ షణ్ముఖ్ ఏసీబీ అధికారులకు చిక్కారు. అదే సమయంలో ఎల్బీనగర్లోని చాంద్పాషా ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేసినట్టు తెలిసింది. సర్కిల్ కార్యాలయం రెవెన్యూ విభాగంలోని బీరువాలో రూ.5 లక్షల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు.