వరంగల్ అర్బన్ జిల్లాలో ముమ్మరంగా జ్వర సర్వే
బాధితుల గుర్తింపు.. వెనువెంటే మెడికల్ కిట్ల పంపిణీ
కరోనా కట్టడికి పక్కాగా వ్యూహం
తగ్గుతున్న పాజిటివ్ కేసులు
వరంగల్, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్, ఇంటింటా జ్వరం సర్వేతో కరోనా వైరస్ వ్యాప్తికి కట్టడి పడుతున్నది. స్వల్ప లక్షణాలున్న వారికి ఇంటివద్దే మందులు, సత్వర వైద్యం అందుతుండడంతో కొవిడ్కు ఆదిలోనే అడ్డుకట్ట పడి పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 394 బృందాలు సర్వే చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో 224 బృందాలు, గ్రామీణ ప్రాంతంలో 171 బృందాలు సర్వేలో పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 4,23,785 ఇండ్లలో సర్వే పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,14,299 ఇండ్లు, నగర పరిధిలో 2,09,486 ఇండ్లలో సర్వే చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరించి కొద్దిపాటి లక్షణాలున్న వారికీ హోం ఐసొలేషన్ కిట్లు ఇస్తున్నారు. లక్షణాలున్న వారి కుటుంబ సభ్యులకు సైతం ముందు జాగ్రత్తగా మందుల కిట్లను అందిస్తున్నారు. ఇప్పటి వరకు 12 వేల కిట్లను పంపిణీ చేశారు. అవసరం ఉన్న వారికి జిల్లాలోని 28 కేంద్రాల్లో వైద్య సదుపాయాలు కల్పించారు. గ్రేటర్ వరంగల్ సర్వే బృందాల్లో ఇద్దరు చొప్పున ఆశ వర్కర్లు, ఇద్దరు మున్సిపల్ సిబ్బంది, గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరు ఆశ కార్యకర్తలు, ఇద్దరు పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
ఈ సర్వేలో ముందుగా ఇంట్లోని కుటుంబసభ్యుల వివరాలను, వారి ఆరోగ్య పరిస్థితి, ఇటీవల వారు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల వివరాలు తెలుసుకుంటున్నారు. లక్షణాలు కలిగి ఉండి ఇతరులకు చెప్పకుండా ఇబ్బంది పడుతున్నవారిని గుర్తిస్తున్నారు. వారికి హోం ఐసొలేషన్ కిట్లు అందిస్తున్నారు. లక్షణాలున్న వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చర్యలు చేపడుతున్నారు. నాలుగు రోజులకు మించి జ్వరంతో బాధపడుతుంటే దగ్గర్లోని ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్తున్నారు. వైద్యాధికారి పర్యవేక్షణలో వైద్యసేవలు అందించి, అవసరాన్ని బట్టి ఆక్సిజన్, ఐసొలేషన్ సేవలు అందిస్తున్నారు. సర్వేలో స్వల్ప లక్షణాలు కలిగి ఉన్న వారిని గుర్తించడం సులభమైంది. కరోనా లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టే వీలు కలిగింది.
ఇటు వైద్య సిబ్బంది ఇంటికే వచ్చి మందులు ఇవ్వడం, జాగ్రత్తలు చెప్పడంతో ప్రజల్లోనూ ఆందోళన తగ్గి ఆరోగ్యంపై భరోసా పెరుగుతున్నది. ఈ నెల 6న సర్వే మొదలు కాగా నగరంలో ఇండ్ల సంఖ్య ఎక్కువ ఉండడంతో ఎక్కువ సమయం పడుతున్నది. సర్వే మొదలైనప్పటి నుంచి ఎంజీఎంకు వచ్చే కరోనా బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. స్వల్పలక్షణాలున్నవారిని ఇండ్లకే పరిమితం చేస్తుండడంతో దవాఖానలపైనా ఒత్తిడి తగ్గుతున్నది. రెండుమూడు రోజులుగా ఎంజీఎంకు వచ్చేవారి సంఖ్య 50లోపే ఉంటున్నది.