హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ‘ఏదైనా కొత్త బైక్ కొంటున్నారా? ఎక్కడైతే వాహనం కొంటున్నారో ఆ షోరూంవారిని కచ్చితంగా రెండు హెల్మెట్లు అడగండి’ అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. కేంద్ర మోటర్ వెహికిల్ రూల్స్ 1989 ప్రకారం 138(4)(ఎఫ్) కింద వాహన తయారీ కంపెనీలు.. వాహన కొనుగోలుదారుడికి రెండు నాణ్యమైన హెల్మెట్లు ఇవ్వాల్సిందేనని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఆ హెల్మెట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనల మేరకు ఉండాలని పేర్కొన్నారు. హెల్మెట్లు ఇవ్వకపోతే వెంటనే వినియోగదారుల ఫోరమ్, పోలీసు, ఆర్టీవో అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.