న్యూయార్క్ : వ్యాపారంలో, కార్పొరేట్ ప్రపంచంలో విజేతగా నిలవాలంటే దండిగా డబ్బులుండాలి..విదేశాల్లో టాప్ పబ్లిక్ స్కూల్స్లో చదవాలని చెబితే అది పొరపాటే. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరవచ్చని నాస్డాక్లో లిస్టయిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ జీస్కేలర్ అధినేత 62 ఏండ్ల జే చౌధరి నిరూపించారు. 1958 ఆగస్ట్ 26న హిమాచల్ప్రదేశ్లోని ఉనా జిల్లాలో చిన్న గ్రామం పనోలో జన్మించిన జే అతి సామాన్యుడిగా ప్రయాణం ప్రారంభించి ప్రస్తుతం అమెరికాలో పలు టెక్ కంపెనీల అధిపతిగా ఎదిగారు. ఆయన ఏడు, ఎనిమిది తరగతులు చదివే సమయంలో గ్రామంలోని ఇండ్లలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో చెట్ల కిందనే చదువుకున్నారు.
పొరుగున ఉండే దుసార గ్రామంలోని హైస్కూల్కు ప్రతిరోజూ నాలుగు కిలోమీటర్లు నడిచివెళ్లేవాడినని చాలా ఏళ్ల కిందట ట్రిబ్యూన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జే గుర్తుచేసుకున్నారు. అనేక అవరోధాలను అధిగమించి జే వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో మాస్టర్స్ చేసేందుకు ఆయన 1980లో తొలిసారిగా అమెరికా వెళ్లేందుకు విమానం ఎక్కారు. ఇక హురున్ గ్లోబల్ రిచ్లిస్ట్ 2021లో జే 1300 కోట్ల డాలర్ల సంపదతో భారత్లో 9వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో జీస్కేలర్ కంపెనీని స్ధాపించిన జేకు ఇప్పుడు ఆ కంపెనీలో 45 శాతం వాటా ఉంది. సొంత కంపెనీని ప్రారంభించే ముందు ఆయన దాదాపు పాతికేళ్ల పాటు ఐబీఎం, యూనిసిసి, ఐక్యూ సాఫ్ట్వేర్ కంపెనీల్లో పలు హోదాల్లో పనిచేశారు.
తనకు డబ్బు కంటే ముఖ్యంగా ఇంటర్నెట్, క్లౌడ్ వేదికలపై వ్యా్పారాన్ని అందరికీ సురక్షితంగా మలచడమే ప్రధానమని జే చెబుతుంటారు. ఇదే తన విజయానికి కీలకమని తాను భావిస్తుంటానని ఆయన పేర్కొన్నారు. శాకాహారాన్ని అమితంగా ఇష్టపడే జే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. వాకింగ్, పర్వతారోహణ పట్ల ఆసక్తి చూపుతారు. చరిత్ర, అంతర్జాతీయ రాజకీయాలు, సైకాలజీ వంటి అంశాలపై పుస్తకాలను చదువుతుంటారు. ఆశయాలు ఆలంబనగా ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న భారత సంతతికి చెందిన జేకు జేజేలు.