ఖమ్మం, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ పత్రికలు ఖమ్మంలోని రాజ్పథ్ ఫంక్షన్ హాలులో స్థిరాస్తి ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి శనివారం ఈ ప్రాపర్టీ షోను ప్రారంభించారు. ఖమ్మం అదనపు కలెక్టర్ ఎస్ మధుసూదన్రావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్ తదితరులు స్టాల్స్ను ప్రారంభించారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్రదర్శనకు విచ్చేసి లక్కీడ్రా తీశారు. జిల్లాలోని పలువురు రియల్టర్లు, డెవలపర్లు, బ్యాంకర్ల స్టాళ్లతో కొలువుదీరిన ఈ ప్రదర్శన తొలి రోజు విజయవంతంగా కొనసాగింది. ఖమ్మం జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందినవారు కూడా ఈ ప్రదర్శనను సందర్శించి స్థిరాస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపారు. వాటి వివరాలతోపాటు బ్యాంకర్లు ఆఫర్ చేస్తున్న రుణ సదుపాయాలపై ఆరా తీశారు. శ్రీబాలాజీ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అధినేత వత్సవాయి రవి, శ్రీజయవిలాసిని డెవలపర్స్ అధినేత రాంబాబు, శ్రీసిటీ అధినేత గరికపాటి విజయ్ తదితరులు సందర్శకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హాజరుకానున్నారు.
అనుమతులున్న ప్లాట్లే కొనాలి..
కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన ప్రాపర్టీ షోలను తొలిసారి ఖమ్మంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంస్థలకు అభినందనలు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలి. హైదరాబాద్కు సమాంతరంగా ఖమ్మం అభివృద్ధి చెందుతున్నది. ఖమ్మంతోపాటు సుడా పరిధిలోని అన్ని ప్రాంతాలు వేగంగా పురోగమిస్తున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తున్నది. వినియోగదారులు అన్ని అనుమతులున్న వెంచర్లలోని ప్లాట్లనే కొనుగోలు చేయాలి. వ్యాపారులు కూడా నిబంధనలకు లోబడి వెంచర్లు వేయాలి. అలా చేస్తేనే అనుమతులు త్వరగా వస్తాయి. ప్రభుత్వ భూములు, శిఖం భూముల్లో వెంచర్లు వేస్తే అనుమతులు రావు. అలాంటి వెంచర్లలో ప్లాట్లు కొంటే వినియోగదారులకు ఇబ్బందులు తప్పవు.
– ఆదర్శ్ సురభి, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్