నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 13: ఏడ్చిఏడ్చి కన్నీళ్లింకిపోతున్నాయి. ఒకరి పెద్ద ఖర్మ ముగియకముందే అదే ఇంట్లో మరొకరిని కాటికి మోసుకుపోవాల్సి వస్తున్నది. అమ్మ పోయారన్న దుఃఖంలో ఉండగానే నాన్న దూరమయ్యారన్న శోకం ఒక ఇంట్లో.. అన్న ఇక లేడన్న వార్త గుండెను బద్దలు చేస్తుండగానే, తమ్ముడు పోయాడన్న పిడుగులాంటి వార్త.. ఒకే ఇంట్లో ఒకరి వెనుక ఒకరిని మోస్తూ కాటికి దారికడుతున్న ఘటనలు.. కరోనా మహమ్మారి రోజులు వ్యవధిలో కుటుంబాలకు కుటుంబాలనే పొట్టనపెట్టుకుంటున్నది. అమ్మా, నాన్న.. అన్నా, తమ్ముడు.. ఇలా వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు తీస్తున్నది. కన్నీళ్లు ఆగకముందే పుట్టెదు దుఃఖాన్ని మిగిలుస్తున్నది. ‘ఏమాయె బిడ్డా.. ఎంత పనైందిరా.. మీ అమ్మ ఎంత మంచిదుండె’ అని ఓదార్చెవారిని దరిచేరకుండా చేసింది.. బంధాలను తుంచేస్తూ.. అనుబంధాలను చిన్నాభిన్నం చేస్తున్నది. ఓ చోట అన్నా, తమ్ముడు.. మరోచోట తల్లీ కొడుకు, ఇంకోచోట తల్లిదండ్రులు, ఇద్దరు కొడుకులు ఇలా అందరినీ అంతులేని విషాదాన్ని మిగులిస్తున్నది కరోనా.
ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఒక్క వైరస్.. 11 రోజుల వ్యవధి.. అమ్మా, నాన్న, అన్నా, తమ్ముడిని బలి తీసుకున్నది. ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలకేంద్రంలో ఈ విషాదం చోటుచేసుకున్నది. విశ్రాంత ఉద్యోగి మద్ది భిక్షం (65) కరోనా బారినపడి హైదరాబాద్లోని దవాఖానలో చికిత్సపొందుతూ ఈ నెల 2న మృతి చెందాడు. నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేసే భిక్షం పెద్ద కుమారుడు వీరన్న (45).. తండ్రి చనిపోయిన రెండ్రోజులకే కన్నుమూశాడు. వీరన్న తమ్ముడు వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉపేందర్ ఈ నెల 11న కరోనాతో మృతిచెందాడు. భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోయిన మద్ది మంగమ్మ (62) బుధవారం అదే వైరస్కు బలైంది.
అమ్మా.. నాన్న.. కుమారుడు..
నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూవెల్మల్లో 20 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనాకు బలయ్యారు. భార్యాభర్తలు శకుంతల (70), కిషన్ (75) కరోనాతో మృతి చెందారు. వారి కుమారుడు రాజ్కుమార్ (35) కరోనాతో హైదరాబాద్లో చికిత్సపొందుతూ గురువారం మృతి చెందాడు.
నాలుగు రోజుల్లో తల్లీకొడుకు..
నాలుగు రోజుల వ్యవధిలో తల్లీకొడుకు కరోనాకు బలయ్యారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలోని హనుమాన్నగర్ కాలనీకి చెందిన దేవరకొండ సుశీల (75) కరోనాతో ఈ నెల 9న మృతిచెందింది. ఆమె రెండో కుమారుడు వెంకటేశ్ (48)కు కరోనా పాజిటివ్గా తేలింది. బుధవారం రాత్రి నిజామాబాద్కు తరలించగా మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు.
మొన్న అన్న.. నిన్న తమ్ముడు
కరోనాతో ఒకరోజు వ్యవధిలో అన్నాతమ్ముడు మృతిచెందాడు. జగిత్యాలకు చెందిన చెట్ల రవీందర్ (48) పట్టణంలో రాఘవేంద్ర మ్యూజిక్ సెంటర్ నిర్వహించేవాడు. రవీందర్, అతడి తమ్ముడు రాజు (44)కు పదిరోజుల కిందట కరోనా సోకింది. దవాఖానలో చికిత్సపొందుతూ బుధవారం రవీందర్ మరణించగా.. గురువారం రాజు మృతిచెందాడు.