హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ కోపరేటివ్ అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) సర్వర్ను హ్యాక్ చేసింది నైజీరియన్ సైబర్ నేరగాళ్లేనని జాయింట్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియన్ సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ టోలిచౌక్లో ఉండే ఆ దేశస్తుడికి టెస్కాబ్లో ఖాతాలు తెరిపించే బాధ్యతను అప్పగించారు. తనకు భారీ మొత్తంలో డబ్బులు వస్తున్నాయని, టెస్కాబ్లో పొదుపుఖాతాలు కావాలని, డిపాజిట్ అయిన డబ్బులో 10 శాతం కమీషన్ ఇస్తానని అతడు చందానగర్కు చెందిన సోదరులు యాసిన్ పాషా, మహ్మద్ రఫీని నమ్మించాడు. వారి చిరునామాతో చందానగర్ బ్రాంచ్లో రెండు ఖాతాలు తెరిచారు. సికింద్రాబాద్ బ్రాంచ్లో సుప్రియ పేరుతో మరో ఖాతా తెరిపించారు. సైబర్ నేరగాళ్లు సర్వర్ను హ్యాక్చేసి బ్యాంకు ప్రధాన ఖాతాలో నుంచి ఈ మూడు ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేందుకు యత్నించారు. ఈ నెల 7న సుప్రియ ఖాతాలోకి రూ.1.94 కోట్లు బదిలీ చేసినవారు.. మరో దఫాలో రఫీ, పాషాఖాతాల్లోకి రూ.50 లక్షల చొప్పున బదిలీకి యత్నించారు. ఆ రోజు బ్యాంకుకు సంబంధించిన నగదు డ్రా పరిమితి రెండు లక్షలే ఉండటంతో. దీంతో పాషా ఖాతాలోకి రూ.2 లక్షలు బదిలీ అయ్యాయి. సుప్రియ ఖాతాలో నుంచి హర్యానా, ఢిల్లీ, మహారాష్ట, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని వివిధ బ్యాంకుల ఖాతాల్లోకి డబ్బు మళ్లించారు. పాషా ఖాతాలోని రూ.2 లక్షలు స్థానికంగా ఉండే నైజీరియన్ తీసుకుని.. రూ. 20 వేలు పాషా, రఫీకి కమీషన్గా అందించాడు. హ్యాకర్లు 102 బ్యాంకు లావాదేవీలు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. పాషా, రఫీని అరెస్ట్ చేశారు. సుప్రియ, నైజీరియన్తోపాటు సైబర్ ముఠా కోసం గాలింపు చేపట్టారు.