రాజన్న సిరిసిల్ల, మే 28 (నమస్తే తెలంగాణ): కరోనాకు శాశ్వత పరిష్కారం వ్యాక్సినేనని, ఈ ఏడాది చివరిలోపు ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్ మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నా మనకు అందుబాటులో లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో కేంద్రం 85 శాతం తన ఆధీనంలోకి తీసుకోవడం దురదృష్టకరమన్నారు. ఇక మిగిలిన 15 శాతంలోనే రాష్ర్టాలు, ప్రైవేటు నిర్వాహకులు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. వ్యాక్సిన్ను ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా ఉంటే మన ప్రజలకే ముందుగా అందేవని అభిప్రాయపడ్డారు. ధార్మిక క్షేత్రమైన వేములవాడలో రూ.22 కోట్లతో నిర్మించిన వంద పడకల ప్రాంతీయ దవాఖానను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటి డోసుల వ్యాక్సిన్ కోసం టెండర్లు పిలిచినందున ఈ యేడాది చివరిలోగా అర్హులైన వారందరికి వ్యాక్సిన్లు వేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. మళ్లీ వైరస్ తీవ్రత పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కరోనా చికిత్సకు అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరోనా కట్టడికి అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యుల సేవలను మంత్రి ప్రశంసించారు.
విదేశాల్లో వైద్య విద్యను పూర్తిచేసిన మనోళ్ల సేవలను అవసరమైతే వినియోగించుకొనే ప్రయత్నం చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎవరు ఎంతగా విమర్శించినా పట్టించుకోవద్దని, ఇప్పటికే వైద్యులు, సిబ్బందిపై భారం ఎక్కువగా పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలకు సర్కారు పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. దక్షిణ కాశీగా ఖ్యాతి గడించిన వేములవాడ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు కోరిక మేరకు సీఎం కేసీఆర్ స్పందించి వందపడకల దవాఖానను మంజూరు చేశారని తెలిపారు. దవాఖాన తుది దశ నిర్మాణ పనులను నెలరోజుల్లో పూర్తి చేయించినందుకు కలెక్టర్ కృష్ణభాస్కర్, వైద్యాధికారి మహేశ్రావును కేటీఆర్ అభినందించారు. సిరిసిల్ల ఏరియా దవాఖాన, వేములవాడ దవాఖానలతో జిల్లా ప్రజలకు 500 పడకలు అందుబాటులోకి వచ్చాయన్నారు. జిల్లాలో చేపట్టిన ఆరోగ్య సర్వేలో జ్వరం ఉన్న బాధితులు 3,900ల మందిని గుర్తించి కిట్లు అందించామని చెప్పారు. సిరిసిల్ల దవాఖాన తరహాలో రూ.40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంటును పదిరోజుల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
కరోనా థర్డ్వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని నిపుణుల హెచ్చరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇందుకోసం సిరిసిల్లలో 50, వేములవాడలో 50 ఐసొలేషన్ సెంటర్లు చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. జూన్ నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. హోం ఐసొలేషన్లో ఉన్న బాధితుల కోసం టెలిసేవలు ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలో లక్షా 22వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, ఎంపీపీ వజ్రమ్మ, వైద్యాధికారులు మురళీధర్రావు, మహేశ్రావు పాల్గొన్నారు.
నిర్వాసితులకు త్వరగా పరిహారం
మధ్యమానేరు నిర్వాసితులకు సాధ్యమైనంత త్వరగా పరిహారం అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వేములవాడ పర్యటన అనంతరం మంత్రి సిరిసిల్లలో పర్యటించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. వేములవాడ నియోజకవర్గానికి చెందిన ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం సాధ్యమైనంత త్వరగా అందేలా చూడాలని కలెక్టర్ను ఆదేశించారు.
మృతి చెందిన అధికారులకు నివాళులు
ఇటీవల కరోనా మృతిచెందిన ఎల్లారెడ్డిపేట ఎంఈవో మంకు రాజయ్య కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రం, గాంధీనగర్లోని ఆయన నివాసానికి వెళ్లి రాజయ్యకు నివాళులర్పించారు. రాజయ్య భార్య శైలజ, కూతురు లాస్యతో మాట్లాడారు. మండల విద్యాధాకారిగానే కాకుండా మంచి మిత్రుడిని కోల్పోయానని విచారం వ్యక్తంచేశారు. చివరి శ్వాస వరకు విద్య కోసం పని చేసిన వ్యక్తి రాజయ్య అని కొనియాడారు. ఎంఈవోగా తనదైన శైలిలో విశేష సేవలు అందించిన రాజయ్యను స్పూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం శ్రమించాలని కూతురు లాస్యకు సూచించారు. ఆ తర్వాత కలెక్టరేట్కు వెళ్లి.. ఇటీవల కరోనాతో మరణించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.