హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సమయాలకు అనుకూలంగానే సిటీ, జిల్లా బస్సు సర్వీసులను నడపాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ సడలింపు సమయంలోనే బస్సు సర్వీసుల సమయాలను సర్దుబాటుచేస్తామని ప్రకటించారు. ఇతర రాష్ర్టాలకు వెళ్లాల్సిన అంతరాష్ట్ర సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. లాక్డౌన్ ప్రకటనతో వివిధ ప్రాంతాల్లోని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారని తన దృష్టికి వచ్చిందన్న రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సులు అన్ని రూట్లలో తిరుగుతున్న నేపథ్యంలో గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.