న్యూఢిల్లీ, జూలై 3: మీ మొబైల్లో హఠాత్తుగా డాటా అయిపోయి ఇంటర్నెట్ బ్రౌజ్ చేయలేకపోతున్నారా?.. కంగారుపడకండి. డాటాను రుణంగా ఇచ్చే సదుపాయాన్ని రిలయన్స్ జియో తాజాగా ప్రవేశపెట్టింది. ‘రీచార్జ్ నౌ.. పే లేటర్’ పేరుతో ప్రారంభించిన ఈ ప్లాన్తో జియో యూజర్లు తక్షణం డాటా లోన్ తీసుకోవచ్చు. రోజువారీ డాటా అయిపోతే, వివిధ కారణాలతో ప్రీ-పెయిడ్ యూజర్లు వెంటనే డాటా టాప్అప్ను వేసుకోలేరని, అటువంటివారు ఈ సదుపాయం ద్వారా 1 జీబీ చొప్పున 5 జీబీల వరకూ లోన్ ప్యాక్స్ పొందవచ్చని కంపెనీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. ఒక్కో జీబీ ప్యాక్ ఖరీదు రూ.11. మైజియో యాప్ ద్వారా ఈ లోన్ పొందవచ్చు. అయితే ఈ డాటా లోన్ పొందాలంటే ఆయా యూజర్ల రీచార్జ్ ప్యాక్ కాలపరిమితి ముగిసి ఉండకూడదు. లోన్గా పొందిన డాటాను రీచార్జ్ వోచర్ కాలపరిమితి ముగిసేవరకూ ఎప్పుడైనా వాడుకోవచ్చు. నిర్దేశించిన చెల్లింపు గడువు తేదీలోగా, ఈ డాటా లోన్ను మైజియో యాప్ ద్వారానే తిరిగి చెల్లించాల్సి ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.