హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఓవైపు డీజిల్, ఇతర విడిభాగాల ధరల్లో అనూహ్య పెరుగుదల.. మరోవైపు కరోనా మహమ్మారితో అనిశ్చితి.. ఆర్టీసీని నష్టాల సుడిగుండంలోకి నెట్టాయి. గత రెండేండ్లలో లీటర్ డీజిల్ ధర రూ.22.09 పెరిగింది. టైర్లు, ఇతర విడిభాగాల ధరలు పెరిగిన కారణంగా నిర్వహణ ఖర్చు అమాంతం పెరిగిపోయింది. రోజుకు రూ.13 కోట్లు ఉన్న ఆర్టీసీ ఆదాయం కరోనా దెబ్బతో పాతాళానికి పడిపోయింది. ముక్కిమూలిగి రూ.3 కోట్లు రావడమే గగనంగా మారింది. క్రమంగా పుంజుకుంటున్నా ఆశించిన స్థాయిలో లేదు. ఆర్టీసీకి ఆదాయం టికెట్ల ద్వారానే వస్తుంది. కానీ.. బస్సులు ప్రస్తుతం కిలోమీటర్కు రూ.33.46 నష్టంతో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టికెట్ ధరలు పెంచితే తప్ప బస్సులు నడిపే పరిస్థితి లేదని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్కు ఆర్టీసీ ఉన్నతాధికారులు విన్నవించారు.
కాంగ్రెస్ హయాంలో వరుసగా నాలుగేండ్లు చార్జీలపెంపు
బస్సు చార్జీల పెంపుపై గగ్గోలుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు వారి హయాంలో ఏ విధంగా ప్రజలపై పెను భారం మోపాయో మర్చిపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2006-2014 మధ్య ఐదుసార్లు చార్జీలు పెంచారు. 2010 నుంచి 2013 వరకు వరుసగా నాలుగుసార్లు చార్జీలు పెంచుకొంటూ పోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2016 జూన్ 27న కిలోమీటర్కు 10 పైసలు పెంచారు. ధరల భారం నుంచి సంస్థను రక్షించేందుకు 2019 డిసెంబర్ 3న మరోసారి కిలోమీటర్కు 20 పైసల చొప్పున చార్జీలు పెంచారు.
శరాఘాతంగా ధరాభారం
ఆర్టీసీ బస్సు చార్జీలు చివరిసారిగా 2019 డిసెంబర్లో పెంచినప్పుడు డీజిల్ ధర లీటర్కు రూ.65. గత రెండేండ్లలో డీజిల్ ధర లీటర్పై రూ.22.09 పెరిగింది. దీంతో రోజుకు డీజిల్పైనే అదనంగా రూ.1.51 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తున్నది. మొత్తంగా ఏడాదికి రూ.551.50 కోట్ల భారం డీజిల్ ధరల రూపంలోనే పడుతున్నది. టైర్ల ధరలు పెరగడంతో కిలోమీటర్కు రూపాయి అదనంగా ఖర్చు పెరిగింది. విడిభాగాల ధరల పెరుగుదలతో కిలోమీటర్కు ఒక రూపాయి అదనపు భారం పడుతున్నది.