హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు మరింత విస్తృతమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికే పరిమితమైన హోం డెలివరీ సేవలను జిల్లాలకు కూడా విస్తరిస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోం డెలివరీ సేవలను తొలుత నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లా కేంద్రాలతో పాటు, ఆయా జిల్లాల్లోని ముఖ్య పట్టణాల్లో అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. త్వరలో బెంగళూరులోని పది ముఖ్యమైన పాయింట్లలో కూడా హోం డెలివరీ సేవలతో పాటు పికప్ సేవలను సైతం అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
వినియోగదారులు పార్శిల్ను బుక్ చేసుకొనే సమయంలో లేదా ఆ పార్శిల్ బస్టాండ్కు వచ్చిన తర్వాత కూడా ఫోన్కాల్ ద్వారా హోం డెలివరీకి ఆర్డర్ పెట్టుకోవచ్చన్నారు. అయితే, హోం డెలివరీకి అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పార్శిళ్లను హోం డెలివరీ చేసేందుకు ఆయా ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. దీంతో వినియోగదారులకు సమయం, రాకపోకల ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాల్లో బస్టాండ్ నుంచి బస్టాండ్ వరకే పార్శిల్ సేవలు అందుబాటులో ఉన్నాయి.